నవ్యాంధ్ర వైసీపీ హయాంలో హత్యాంధ్రగా .. సీఎం సమాధానం ఏంటి ? అచ్చెన్న ఫైర్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నవ్యాంధ్రప్రదేశ్ ను వైసీపీ ప్రభుత్వం హత్యాంధ్ర ప్రదేశ్ గా మార్చిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని, కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించిన అచ్చెన్న ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టిడిపి కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎవరిదో అండ చూసుకొని రెచ్చిపోయే గుండాలు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించిన అచ్చెన్నాయుడు, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసిపి అరాచకాలపై ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 మంది టిడిపి కార్యకర్తలను బలి తీసుకుందని, మరో 14 వందల మందికి పైగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే పోలీసులకు కనిపించడం లేదా అని అచ్చెన్నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రజాసమస్యలను పక్కదారి పట్టించడం కోసం హత్యలతో రక్తపాతం సృష్టిస్తున్నారని, నిత్యం ఏదో ఒక గందరగోళం సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని హత్యకు కారకులైన ఏ ఒక్కరినైనా పోలీసులు శిక్షించారా అని ప్రశ్నించారు అచ్చెన్న. పరిశ్రమలతో కళకళలాడాల్సిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దాడులు, హత్యలతో విలవిలలాడుతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.