కర్నూలులో ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులోని ఆంధ్రజ్యోతి ప్రాంతీయ కార్యాలయంపై నంద్యాల మండలం కొత్తపల్లి సర్పంచ్ అనుచరులు దాడి చేశారు. పెన్షన్ల పంపిణీలో గోల్మాల్ జరుగుతున్న అంశాన్ని వెలుగులోకి తెస్తూ ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్, 50 మంది ముఠాతో వచ్చి ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేశారు.
అక్కడ ఉన్న సిబ్బంది సెల్ఫోన్లను తీసుకుని ఫర్నిఛర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అనంతలో భారీ అగ్ని ప్రమాదం
అనంతపురం మున్సిపల్ కాంప్లెక్స్లో మంగళవారం తెల్లవారుజామున ఓ మెడికల్ ఏజెన్సీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గదిలోంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ సంఘటనలో సుమారు 40 లక్షల విలువైన వైద్య పరికరాలు, మందులు అగ్నికి ఆహుతైనట్లు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు.
వరద ప్రాంతాలకు వైద్య బృందాలు
వరద నీటిలో చిక్కుకొన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంది. సుమారు 160 వైద్య బృందాలను ముంపు ప్రాంతాలకు పంపుతున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వైద్య బృందాలను తరలిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేనందున ప్రస్తుతం వరద ప్రాంతాల్లోని ఆస్పత్రులు మూత పడ్డాయి. తాగునీటిలో క్లోరిన్ బిళ్లలు వేసి అరగంట తర్వాత నీటిని వడగట్టి తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.