టిడిపి సర్పంచ్ ఇంటిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడి
విజయవాడ/గుంటూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సర్పంచి ఇంటి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు మంగళవారం సాయంత్రం దాడి చేసినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల టిడిపి మద్దతుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి ఇంటి పైన పలువురు కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసమైంది. కారు అద్దాలు పగిలాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటి పైన దాడిని బుధవారం తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. జగన్ ఓ దోపిడీదారు అని, అలాంటి వ్యక్తి విడుదలను చూసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పొంగిపోవద్దని హితవు పలికారు. జగన్ జనాల కోసమో, దేశం కోసమో పోరాడి జైలుకు వెళ్లలేదన్నారు.
కాంగ్రెసు, జగన్ కుమ్మక్కు
ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తికి భారీ భద్రతను, ర్యాలీకి అనుమతించడం ద్వారా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కు బయటపడిందని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వేరుగా అన్నారు. జగన్ ర్యాలీకి ఎందుకు అనుమతించారో చెప్పాలని ప్రశ్నించారు.
జగన్ను కలిసిన సచివాలయ ఉద్యోగులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం కలిశారు. జగన్ నివాసానికి వచ్చిన వారు సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఆందోళనను వివరించారు. ఈ నెల 27 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాకు మద్దతు ఇవ్వడంతో పాటు పాల్గొనాలని ఆహ్వానించారు.