
ఈ ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు జరగొచ్చు: ఇంటెలిజెన్స్ హెచ్చరిక
అమరావతి: విశాఖపట్నంలో ఇటీవల రాష్ట్ర మంత్రులపై జరిగిన దాడి ఘటన ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అధికార, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధమే కొనసాగింది. దాడికి పాల్పడ్డారంటూ పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, తాజాగా, మరిన్ని దాడులకు సంబంధించి హెచ్చరికలు విడుదలయ్యాయి.
తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఆర్జీలు ఇచ్చే సాకుతోనూ జనసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది.

టెక్కలిలో జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి అప్రమత్తం కావాలని ఇంటెలిజెన్స్ సూచించింది. స్థానికంగా కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్న అంశాలతో ఇంటెలిజెన్స్ వర్గాలు.. మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాలో.. మంత్రులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, రోజా, దాడిశెట్టి రాజా, జోగి రమేష్, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్, జక్కంపూడి రాజా, పేర్ని నాని, కొడాలి నాని ఉన్నారని పలు మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి.