అమ్మాయిల చేతుల్లో నిప్పులు పోసిన బాబీ బాబా
సంగారెడ్డి/ నల్లగొండ/ మహబూబ్నగర్: మెదక్ జిల్లాలో ఓ విద్యార్థి బాబా అవతారం ఎత్తి విద్యార్థినుల చేతిలో నిప్పులు పోశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. మెదక్ జిల్లా నరసాపూర్ మండలం పెద్దచింతకుంట సమీపంలోని సీతారాం తండాలో అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వినోద్ అనే విద్యార్థి సెల్ఫోన్ ఇటీవల పోయింది. దాంతో అతడు 'బాబీ బాబా'ను ఆశ్రయించాడు.
సదరు బాబీ బాబా ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారానికోసారి బాబా అవతారం ఎత్తుతాడు. వినోద్ను ఎవరిమీదైనా అనుమానం ఉందా అని బాబీ బాబా అడిగితే ఐదుగురు విద్యార్థినుల పేర్లు చెప్పాడు. దాంతో వాళ్లను తీసుకురమ్మని చెప్పగా, తీసుకెళ్లాడు. వెంటనే బాబీ బాబా వాళ్ల చేతుల్లో నిప్పులు పోసి ఎవరి చేతులు కాలితే వాళ్లే దొంగలన్నట్లుగా అగ్నిపరీక్ష పెట్టాడు. ఐదుగురికి చేతులు కాలడంతో వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ శివారులో హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బొమ్మల రామారం మండలం యావాపూర్ తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై తుర్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకని దార్యాప్తు చేపట్టారు.
పాలమూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య
మహబూబ్నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం తిరుమలాయపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన వేపచెట్టు భద్రయ్య (25) జిల్లాకేంద్రంలోని రాజీవ్ స్వగృహలో ఆఫీస్బాయ్గా పని చేస్తున్నాడు. భార్య స్వప్న ప్రసవం కోసం కుమారుడితో సహా పుట్టిల్లు మహబూబ్నగర్కు వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం భద్రయ్య తనవద్దే ఉంటున్న తల్లితో గొడవ పడ్డాడు. దీంతో ఆమె పెద్దకుమారుడు ఆంజనేయులు ఇంటికి వెళ్లింది.
అమ్మను ఇంటికి పంపించాలంటూ భద్రయ్య గురువారం సోదరుడితో ఘర్షణకు దిగాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బద్రయ్య ఇంట్లోనే మృతి చెంది కనిపించాడు. గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో తలపై, కణతపై మోది, వృశణాలను గాయపరిచి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ కిషన్, ఘనపురం ఎస్సై మచ్ఛేందర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.