అట్టర్ ప్లాప్, ముద్రగడే కాపు నాయకుడా?: బుజ్జి, ‘ఎన్టీఆర్తో బాబుకు పోలికా?’
పశ్చిమగోదావరి: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఏలూరు తెలుగుదేశం ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తుని దుర్ఘటనలో ముద్రగడ పద్మనాభమే ఏ1 నిందితుడని ఆరోపించారు. కాపులకు ముద్రగడ ఒక్కరే నాయకుడా? అని ప్రశ్నించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుజ్జ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో ముద్రగడ సాధించింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన అట్టర్ ఫ్లాపయ్యారని అన్నారు. ఆఖరికి టిడిని ప్రభుత్వం చెప్పిందే జరిగిందని బడేటి బుజ్జి అన్నారు.
ఎన్టీఆర్తో బాబుకి పోలికా: తులసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకి, ఎన్టీఆర్కు సతీసావిత్రికీ.. చింతామణికి ఉన్నంత తేడా ఉందని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలోని ఆయన స్వగృహంలో మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడారు.
అప్పట్లో కాంగ్రెస్ శాసనసభ్యులుగా గెలిచిన రత్తయ్య, నారాయణ, ఆదయ్యలు రాజీనామా చేయకుండా టీడీపీలో చేరితే.. ఎన్టీఆర్ వారిని పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వలసలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
నిరంతరం ఎన్టీఆర్ పేరును దొంగ జపం చేసే టిడిపి నేతలు పార్టీఫిరాయింపుల విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు చరిత్ర హీనుడవుతాడని అన్నారు. పార్టీఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.