ఆ పరిస్థితి రావడం ఎంతో బాధాకరం: గుర్రంపై బాలకృష్ణ స్వారీ
గుంటూరు: స్వర్గీయం ఎన్టీఆర్ తెలుగు భాష, తెలుగు ప్రజలు, తెలుగు మహిళల సంక్షేమం కోసం పరితపించేవారని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మంగళవారం రాత్రి బాలకృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాతృభాష తల్లి పాలతో సమానమని, పరాయి భాష పాల డబ్బా వంటిదని అన్నారు. పాశ్చాత్య మోజులో పడి మన సంప్రదాయాలకు దూరం కావద్దని యువతకు సూచించారు.
తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన ఎన్టీఆర్ స్ఫూర్తితో మనందరం ముందుకు సాగాలన్నారు. ఎడ్ల బండ్ల పోటీలు, కుస్తీపోటీల వంటివి మన సంప్రదాయాలకు ప్రతీకలని, ఇటువంటివి భావితరాలకు తెలియాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పోటీలు జరగాలని అన్నారు.
ఆ మహానుభావుడు పార్టీపెట్టి 35 ఏళ్లవుతోందని, ఈ పండుగ రోజున మన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎడ్ల బండ్ల పోటీలను ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన తండ్రి పేరుపై ఏటా ఈ పోటీలు నిర్వహించటం అభినందించదగిన విషయమని, ఆయనను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
కన్నతల్లి వంటి తెలుగు భాషను కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడడం బాధాకరమని, పక్కనున్న తమిళనాడు వంటి రాష్ట్రాలను చూసి నేర్చుకోవలసిన పరిస్థితి రావడం కూడా బాధించే విషయమన్నారు. ఇప్పటికైనా యువత భాష, సంస్కృతి పరిరక్షణకు నడుంబిగించాలని బాలయ్య సూచించారు.
తెనాలి చేరుకున్న బాలకృష్ణ బంధువు గవిని వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పోటీలు జరిగే ప్రాంగణానికి అభిమానులతో భారీ ప్రదర్శన మధ్య వెళ్లారు. టాపులేని జీపుపై పట్టణ వీధుల్లో జనానికి అభివాదం చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించారు.
ఆ తర్వాత ఎడ్ల బండ్ల పోటీలను ప్రారంబించారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. తర్వాత ఆలపాటి శివరామకృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలువేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ క్రీడా జ్యోతిని వెలిగించారు.
అభిమానులు తీసుకువచ్చిన పొట్టేళ్ల బండిపై ఎక్కిన బాలకృష్ణ అక్కడే గుర్రంపై స్వారీ కూడా చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, మహిళాకమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, దేవినేని మల్లికార్జునరావు, మున్సిపల్ ఛైర్పర్సన్ కొత్తమాసు తులసీదాసు తదితరులు హాజరయ్యారు.