ఐనా బుద్ధిరాలేదు: జగన్పై బాలయ్య పరోక్ష విమర్శలు, బాబుకు ప్రశంసలు
విశాఖపట్నం: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం చంద్రబాబుకు ఎవరూ సాటిలేరని అన్నారు.
విశాఖపట్టణంలో తెలుగు యువత కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్న కనీస ఆలోచన కూడా లేదని బాలకృష్ణ విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు.
కాగా, అంతకుముందు, గిరిజన మహిళలతో కలిసి బాలయ్య చేసిన థింసా నృత్యం ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని తిలకించిన తెలుగు తమ్ముళ్లు, బాలయ్య అభిమానులు ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.