పెట్రోల్, డీజిల్ డ్యూటీపై కేంద్రం తాజా నిర్ణయం: జూన్ 1 నుంచి అమలు
కొద్దిరోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. 15 రోజుల వ్యవధిలో ఇప్పటికే వీటి రేట్లు రూ. 7.50 పైసల వరకు ఎగబాకాయి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు సైతం వీటికి తోడవుతున్నాయి. రేటు విషయంలో ఈ మూడింటి మధ్య పెద్ద తేడా ఉండట్లేదు. ఇక ముందు పెరగకపోవచ్చనే గ్యారంటీ లేదు. జూన్ 1వ తేదీ నుంచి మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు మళ్లీ పెరగొచ్చనే వాదనలు లేకపోలేదు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ తో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) పై ఎగుమతి సుంకాలను మరింత తగ్గించింది. 15 రోజుల పాటు అంటే.. జూన్ 1 నుండి 15 వరకు ఈ తగ్గుదల కొనసాగుతుంది. అంతర్జాతీయ ఇంధన ధరల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి 15 రోజులకోసారి నిర్వహించే సమీక్ష సందర్భంగా పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ డ్యూటీని సవరించింది. దేశీయ ఇంధన పన్నులలో ఎటువంటి మార్పు చేయలేదు.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 1 నుండి ప్రారంభం అయ్యే తొలి 15 రోజులకు ఈ తగ్గింపులు వర్తిస్తాయి. సవరించిన రేట్ల ప్రకారం పెట్రోల్పై ఎగుమతి సుంకం లీటరుకు మూడు నుండి రూపాయిన్నరకు తగ్గింది. డీజిల్పై సుంకం లీటరుకు రూ. 16.5 నుండి రూ. 13.5 పైసలకు తగ్గింది. ఏటీఎఫ్పై విధించే ట్యాక్స్ 16 రూపాయల నుండి రూ. 9.5 పైసలకు చేరింది.
పెట్రోల్ ఎగుమతులపై విధించే డ్యూటీ.. పూర్తిగా ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంగా వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్ వర్తించదు. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు వసూలు చేసే మొత్తాన్ని కూడా అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ గానే పరిగణిస్తుంది. ఈ ఎగుమతి సుంకాలను ఈ ఏడాది మార్చి 27న ప్రవేశపెట్టింది. పశ్చిమ ఆసియా సంక్షోభం మధ్య దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత సుస్థిరం చేయడం, ఎగుమతులను తగ్గించడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం.
అంతర్జాతీయ ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సగటు ధరల ఆధారంగా ప్రతి పక్షంరోజులకు ఈ రేట్లను సమీక్షిస్తారు. తాజా సవరణ మే 16న జరిగింది. నాటి సమీక్షలో పెట్రోల్పై ఎగుమతి సుంకం లీటరుకు రూ. 3, డీజిల్పై రూ. 16.5, ఏటీఎఫ్పై రూ. 16గా ఖరారు చేశారు. అలాగే ముడిచమురు ఉత్పత్తిదారులు, ఇంధన ఎగుమతులపై విండ్ఫాల్ పన్నును మొదటిసారిగా 2022లో విధించింది కేంద్రం.












Click it and Unblock the Notifications