హోదా: తెలుగు ఆత్మగౌరవం పేరుతో బిజెపికి బాలకృష్ణ హెచ్చరిక, మోడీకి కాంగ్రెస్ మట్టి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం ఉదయం స్పందించారు. ఆయన పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి హెచ్చరికలు చేశారని చెప్పవచ్చు.
ఉదయం కేన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా పైన ఏపీ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారన్నారు. కేంద్రం ఏపీకి ఆ హామీ నెరవేర్చుతుందనే నమ్మకం ఉందన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అబిప్రాయపడ్డారు. దశల వారీగా ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలన్నారు. హామీల్లో భాగంగానే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. పరిస్థితి చేయి దాటేంత వరకు కేంద్రం చూస్తూ ఊరుకోవద్దన్నారు.
కాంగ్రెస్ మట్టి సత్యాగ్రహం
నాడు మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్య్ర సాధనలో కీలక ఘట్టంగా మారిందని, అదేవిధంగా ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా, ప్యాకేజీ, ఇచ్చిన హామీలన్నింటినీ సాధించుకునేందుకు మట్టి సత్యాగ్రహం ప్రారంభిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి శనివారం ప్రకటించారు.
తొలిగా అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామం నీలకంఠాపురం పక్కనున్న గోవిందాపురం, గంగులవాయిపాలెం గ్రామాలనుంచి మట్టిని, ఆ గ్రామాల సర్పంచులు హనుమక్క, లక్ష్మీదేవమ్మలు రాసిన లేఖలను ప్రధాని మోడీకి కొరియర్ ద్వారా పంపిస్తున్నామన్నారు.
చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె, వెంకయ్య నాయుడు స్వగ్రామం చవటవారిపల్లె, సుజనాచౌదరి సొంతూరు కంచికచర్ల, అశోక్ గజపతిరాజు స్వస్థలం విజయనగరం కోటలతో పాటు రాష్ట్రంలోని 13వేల పంచాయతీలు, పురపాలక సంఘాల్లోని మూడు వేల వార్డుల నుంచి మట్టిని సేకరించి ప్రధానికి పంపుతామన్నారు.
తిరుమల పవిత్రమట్టితో పాటు అన్ని పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమట్టి, నదుల నుంచి జలాలను మోడీకి పంపే ఉద్యమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న దానిపై మూడో తేదీన జరిగే పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశంలో చర్చిస్తామన్నారు.
శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య, పార్టీ నేతలు తులసి రెడ్డి, గంగాభవానిలతో కలిసి శనివారం ఇందిరాభవన్లో విలేకరులతో రఘువీరా మాట్లాడారు. రాయలసీమ రాళ్లసీమగా, ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా మిగిలిపోకూడదంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తనను విమానంలో తిరగొద్దని వైద్యులు చెప్పారంటూనే చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరిగేందుకు రూ.వంద కోట్లు ఖర్చు చేశారన్నారు. ఆయన సామాన్యులను కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కనీయకుండా చేస్తున్నారన్నారు.
బిహార్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని ఆదివారం ఉదయం పాట్నా ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చే ప్రయాణికుల వద్ద ప్రచారం చేయనున్నామన్నారు. శంకుస్థాపన సభలో నరేంద్ర మోడీ, మాట్లాడుతూ తనది, చంద్రబాబుది ఒకటే ఆలోచన విధానం (వేవ్లెంగ్త్) అనడాన్ని సిరామచంద్రయ్య ఎద్దేవా చేశారు.
ప్రజలకు ద్రోహం చేయడంలో, ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంలో, నిత్యావసర ధరలు పెంచేయడంలో ఇద్దరిదీ ఒకటే వేవ్లెంగ్త్ అని ఎద్దేవా చేశారు.
ప్రధాని ఎదురుగా కనీసం ప్రత్యేకహోదా కావాలని అడిగే ధైర్యం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందన్నారు. శంకుస్థాపనకు రూ.9 కోట్లే విడుదల చేశామంటున్న ప్రభుత్వం మిగిలిన డబ్బు క్విడ్ప్రోకో కింద కంపెనీలతో పెట్టించిందా? అని ప్రశ్నించారు. శంకుస్థాపన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.