బందర్ వాసులకు గుడ్ న్యూస్: ఎంపీ బాలశౌరి కృషి, మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్.!
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పలు రైల్వే ప్రాజెక్ట్ ల నిమిత్తం నిధులు సమాకూర్చాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కోరారు.ముఖ్యంగా మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణం ఆవశ్యకతను మంత్రికి ఎంపీ వివరించారు.మంగళవారం ఢిల్లీలో మచిలీపట్నం పరిధిలోని పలు రైల్వే అభివృద్ధి పనులపై రైల్వే మంత్రితో ఎంపీ బాలశౌరి చర్చించారు.
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.అదేవిధంగా ఇటీవల ప్రతిపాదించిన మచిలీపట్నం - నర్సాపురం రైల్వే లైను సర్వే నిమిత్తం అనుమతులు మంజూరు చేయడం అభినందనీయమని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్ని చిలకలపూడి,పల్లెపాలెం,బంటుమిల్లి,మాట్లాం మీదుగా ఏర్పాటు చేయాలని ఎంపీ కోరగా దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

మచిలీపట్నం రేపల్లె రైల్వే లైను ఎంతో అవసరం
మచిలీపట్నం - రేపల్లె లైను ఎప్పటినుంచో డిమాండ్ ఉందని,ఈ లైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల చిరకాల కోరిక తీరుతుందని ఎంపీ బాలశౌరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి తెలిపారు.అదేవిధంగా ఇప్పుడున్న రైల్వే లైను ప్రకారం మచిలీపట్నం నుంచి వయా గుడివాడ, విజయవాడ, తెనాలి చేరుకోవాలంటే సుమారు 145 కి.మీ ప్రయాణించాలన్నారు. అదే మచిలీపట్నం రేపల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తే కేవలం 45 కి.మీ. దూరంలో తెనాలి చేరుకుని అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులువుగా ఉంటుందని ఎంపీ తెలిపారు.
సుమారు 100 కి.మీ. దూరం తగ్గటంతోపాటు విజయవాడ జంక్షన్ మీద ట్రాఫిక్ భారం పడకుండా ఉంటుందన్నారు.దీంతోపాటు గత ఏడాది సెప్టెంబర్లో నిలిపివేసిన మచిలీపట్నం నంచి ధర్మవరం వయా తిరుపతికి రైలు పునరుద్ధరించాలని ఎంపీ బాలశౌరి కోరారు.ఈ రైలును ఏర్పాటు చేస్తే మచిలీపట్నం ప్రాంత భక్తులు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకునే కోరిక తీరుతుందన్నారు. గుడివాడ ప్రాంతంలోని వడ్లమన్నాడు గ్రామం,మచిలీపట్నంలో చిలకపూడి వద్ద రైళ్లను నిలుపుదల చేయాలని రైల్వే మంత్రిని ఎంపీ బాలశౌరి కోరారు.












Click it and Unblock the Notifications