ఇక అంతా స్వేచ్ఛ: బార్కుడియా.... బైబై (ఫొటోలు)
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అకడమిక్ స్టాఫ్ కళాశాల పరిసరాల్లో ఈ నెల 7వ తేదీన లభించిన అరుదైన సరీసృపం బార్కుడియా ఇన్సులారిస్కు స్వేచ్ఛను ప్రసాదించారు. లభించిన చోటనే పచ్చని ప్రదేశంలో దాన్ని మంగళవారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జిఎస్ఎస్ రాజు విడిచిపెట్టారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం జీవవైవిధ్యానికి నెలవని రాజు ఈ సందర్భంగా అన్నారు. అరుదైన జీవులు సంచరించడానికి వీలుగాఈ ప్రదేశాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిశోధకులు ఆయా జీవుల జీవనవిధానంపై పరిశోధలను జరపాలని, జీవశాస్త్ర విభాగం ఇటువంటి పరిశోధనలను ప్రోత్సహించాలని ఆయన అన్నారు. పరిశోధనల వల్ల జీవ సంరక్షణకు అనుసరించాల్సిన విధానాలు ఆచరణలోకి వస్తాయని ఆయన చెప్పారు.

బార్కుడియా ఇన్సులారిస్ను తొలిసారిగా 1917లో ఒడిషాలోని బార్కుడా ద్వీపంలో కొనుగొన్నారని అకడమిక్ స్టాఫ్ కళాశాల సంచాలకుడు ఆచార్య శ్రీరాములు చెప్పారు. కాళ్లులేని ఈ సరీసృపాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) 1990లో అరుదైన జీవిగా గుర్తించిందని ఆయన అన్నారు. అడవుల నరికివేత కారణంగా ఇదీ అంతరించిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇఎ నారాయణ, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సివి రామన్, ఆచార్య యు. షమీమ్, డిఇ బాబు, డిఎఫ్వో రామలింగం, జీవశాస్త్ర విభాగం ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications