బీ కేర్ ఫుల్... అవసరమైన ఇంజెక్షన్లు తెప్పించండి... బ్లాక్ ఫంగస్పై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు...
బ్లాక్ ఫంగస్ కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం(మే 24) నిర్వహించిన సమీక్షా సమావేశంలో దీనిపై ప్రత్యేకంగా చర్చించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని... ఆ వ్యాధి చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లు తెప్పించడంపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనా వెంటనే ఆరోగ్య శాఖకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో 50 పడకల కంటే ఎక్కువ ఉన్న ప్రతీ ఆస్పత్రిలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఉండాలని సీఎం పేర్కొన్నారు. అగస్టు చివరి కల్లా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకునే ప్రైవేట్ ఆస్పత్రులకు 30శాతం ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ అగస్టు చివరికల్లా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు కావాలన్నారు.
యాస్ తుఫాన్ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ చేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి కోవిడ్ రోగుల తరలింపుకు చర్యలు చేపట్టాలన్నారు. తుఫాన్ ప్రభావం మొదలుకాక ముందే ఆ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. తుఫాన్ కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొనేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి 15వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను తెప్పిస్తున్నామని... వాటి నిర్వహణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
బోధనా ఆస్పత్రుల్లోనూ కార్పోరేట్ ఆస్పత్రుల తరహాలోనే నాణ్యతా ప్రమాణాలు ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రోగులకు ఇచ్చే ఆహారం మొదలు పారిశుద్ధ్యం వరకూ అన్నీ నాణ్యతగా ఉండాలన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారులను ఎదుర్కొనేలా ఆస్పత్రులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని,డీజీపీ గౌతమ్ సవాంగ్,కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తదితరులు హాజరయ్యారు.
Recommended Video
కాగా,బ్లాక్ ఫంగస్ చికిత్సను ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇటీవలే బ్లాక్ ఫంగస్(మ్యుకర్మైకోసిస్) చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.