బస్సులు ధ్వంసం చేయండి!: వైసిపి ఎమ్మెల్యే జలీల్కు బెజవాడ సిపి హెచ్చరిక
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ శుక్రవారం హెచ్చరించారు. రేపటి వైసిపి బంద్ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెప్పడం సరికాదన్నారు.
ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవచ్చునని చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బంద్ సందర్భంగా బస్సులు ధ్వంసం చేయాలని వైసిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చెప్పారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవచ్చన్నారు. ఎవరైనా బలవంతంగా బంద్ చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏపీలో అటవీప్రాంతాన్ని 40శాతానికి పెంచుతాం: చంద్రబాబు
నూతన రాజధాని ప్రాంతంలో చెట్ల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ ద్వారా సీఆర్డీఏ పరిధిలో విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.
కృష్ణా జిల్లాలో దాదాపు 374 హెక్టార్లలో మొత్తం 3.71 టన్నుల విత్తనాలను హెలికాప్టర్ ద్వారా చల్లనున్నారు. వేప, చింత, తంగేడు, సుబాబుల్ విత్తనాలను హెలికాప్టర్ ద్వారా ఈ ప్రాంతంలో చల్లనున్నారు. కృష్ణా జిల్లాలోని సీఆర్డీఏ పరిధిలో ఉన్న 6 రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాల్లో విత్తనాలు చల్లనున్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతానికి అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ రోజు కృష్ణాజిల్లా, రేపు గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం 14 టన్నుల విత్తనాలను జల్లుతారు.