సీఎం జగన్ డెసిషన్స్-భీమ్లా వైబ్రేషన్స్: ఏపీలో మళ్లీ ఆట మొదలు-సంక్రాంతికే పవన్ సినిమా..!!
తెలుగు రాజకీయ తరహాలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ నిర్ణయాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ సంక్రాంతికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల కోసం భీమ్లా నాయక్ రిలీజ్ ను వాయిదా వేసారు. ఆర్ఆర్ఆర్.. రాధేశ్యామ్ కోసం పవన్ తో పాటుగా భీమ్లా నాయక్ నిర్మాతలు సైతం అందుకు అంగీకరించారు. అయితే, ఇప్పుడు కరోనా కేసులు- ఒమిక్రాన్ కారణంగా అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చారు.

పాన్ ఇండియా సినిమాలపై కరోనా ఎఫెక్ట్
దీంతో..పలు భాషల్లో విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడింది. రాధేశ్యామ్ సైతం వాయిదా దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో..సంక్రాంతికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా భీమ్లా సైతం సంక్రాంతికే విడుదలకు అంతా సిద్దం చేసారు. కానీ, నిర్మాతల మండలి అభ్యర్ధన మేరకు ఫిబ్రవరి 25న శివరాత్రికి విడుదల చేసే విధంగా అంగీకారం చేసుకున్నారు. ఇప్పుడు, పాన్ ఇండియా మూవీలు విడుదల కావటంతో..తిరిగి భీమ్లా నాయక్ విడుదలకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్
అయితే, భీమ్లా నాయక్ మూవీ విడుదల ఏపీలో టిక్కెట్ల రేట్ల తగ్గింపు నేపథ్యంలో ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందనే చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశం పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తనను ఆర్దికంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తే.. ఫ్రీ గా సినిమాలు వేస్తానంటూ వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు పైన ప్రభుత్వం వెనుకడుగు వేసే అవకాశం కనిపించటం లేదు. అదే సమయంలో థియేటర్ల వివాదమూ కొనసాగుతోంది.

ఏపీలో భీమ్లా పైన ఎఫెక్ట్ పడేనా
ఇప్పుడు సంక్రాంతికి సినిమా విడుదల అయితే, థియేటర్ల వ్యవహారం పెద్ద సమస్య కాకపోయినా..టిక్కెట్ల ధరల తగ్గింపు మాత్రం సమస్యగా మారే పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ వివాదం పరిష్కారం కోసం నియమించిన అధికారుల కమిటీ సైతం తిరిగి 11వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించింది. అయితే, సంక్రాంతి ముందు సమావేశమయ్యే అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఏం నివేదిక ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, తాజాగా ఈ రోజు సీఎం చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే...టిక్కెట్ల ధరల తగ్గింపు అంశం లో వెనుకడుగు వేసే పరిస్థితి లేదనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి.

సిద్దమే అంటున్న భీమ్లా
దీంతో..ఇప్పుడు భీమ్లా నాయక్ బయటకు రిలీజ్ చర్చ తో..ఇప్పుడు మరోసారి ఇది కీలక అంశంగా మారుతోంది. వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదలకు సంబంధించి మేకర్స్ అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు. అయితే, టాలీవుడ్ టాక్ మేరకు సంక్రాంతికి భీమ్లానాయక్ అభిమానుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతున్నా.. భీమ్లా మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications