Bhogi 2020 : తెలుగు లోగిళ్లలో భోగి సందడి.. పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి కనువిందు చేస్తోంది. వాకిళ్లలో వేసిన రంగు రంగుల ముగ్గులు,నోరూరించే వంటకాలు,బంధువుల కోలాహలంతో తెలుగు పరివారం సంక్రాంతి శోభను సంతరించుకుంది. నేడు సంక్రాంతిలో భాగమైన భోగి పర్వదినం కావడంతో.. ఇళ్ల ముందు చలిమంటలు వేసుకుని జనం వెచ్చదనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భోగి పండుగ విశేషాల గురించి తెలుసుకుందాం..
భోగి వెనక పురాణ గాథ
'భుగ్' అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం అని అర్థం. పూర్వం ఇదే దినం శ్రీరంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దాని ప్రతీకగా భోగి పండగను జరుపుకుంటారని పురాణం చెబుతోంది. ఇక మరో కథనం ఏంటంటే.. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణగాథతో ముడిపడి ఉన్నది. దీని ప్రకారం బలిచక్రవర్తిని పాతాళ రాజుగా ఉండమని కోరిన విష్ణువు.. ప్రతీ సంక్రాంతికి భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరమిచ్చాడని చెబుతారు. అలా బలిచక్రవర్తి రాకను ఆహ్వానించేందుకు భోగి మంటలు వేస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి.
భోగి మంట వెనుక శాస్త్రీయత
సాధారణంగా సంక్రాంతి వచ్చేది చలికాలంలో కాబట్టి.. వెచ్చదనం కోసమం భోగి మంటలు వేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ వెచ్చదనం కోసమే కాదు.. దీని వెనకాల ఆరోగ్య సూత్రం కూడా ఉందంటున్నారు. ధనుర్మాసం వాకిళ్లలో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా వాడుతారు. భోగి మంటల్లో వీటినే వేసి కాలుస్తారు. దీని వలన అక్కడి గాలిలోని సూక్ష్మ క్రిములు నశించి గాలి శుద్ది అవుతుందనే ఒక నమ్మకం చాలామందిలో ఉంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.
ఇప్పుడలా లేదు..
గతంలో అయితే ఇలా పిడకలను భోగి మంటలకు వాడేవారు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులు,రబ్బర్ టైర్లు,ఏది దొరికితే అది మంటల్లో వేసి కాల్చేస్తున్నారు. తద్వారా గాలి మరింత కలుషితమై లేని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. నిజానికి ఈ భోగి మంటల ఉద్దేశం.. ఇంట్లోని పాత వస్తువులు మాత్రమే కాల్చేయడం కాదు. మనలోని మాలిన్యాలను తొలగించుకోవడం.
భోగి పళ్లు ఎందుకు పోస్తారో తెలుసా..
ఇక భోగి రోజు చిన్నారులకు భోగి పళ్లు పోస్తారన్న సంగతి తెలిసిందే. దీనికి కూడా ఓ పురాణ గాథ ఉంది. రేగి చెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణకు ప్రతిరూపాలుగా రేగి పండ్లను,రాగి పండ్లను పరిగణిస్తారు. సూర్య దేవునికి కూడా ఇది ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం,రంగు,కలిగిన రేగుపళ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోయడం ద్వారా శ్రీ లక్ష్మీ నారాయణ అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అలాగే పిల్లలకి దిష్టి తొలగిపోయి.. వారి ఎదుగుదులకు తోడ్పడుతుందని భావిస్తారు. అలాగే బాహ్య నేత్రాలకు కనిపించని బ్రహ్మ రంధ్రం తలపై భాగంలో ఉంటుందని చెబుతారు. ఇలా భోగిపండ్లు పోయడం ద్వారా.. అవి బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపిస్తాయని, తద్వారా పిల్లల బుద్ది వికసిస్తుందని నమ్ముతారు.