అన్నప్రసాదాలపై టీటీడీ తాజా నిర్ణయాలు
శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు వడ్డించే అన్నప్రసాదాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తాజా నిర్ణయాలను తీసుకుంది. భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాన్ని అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని పునరుద్ఘాటించింది. నాణ్యమైన ఆహారాన్ని అందించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఉద్దేశంతో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఏపీ, తెలంగాణలకు చెందిన బియ్యం, పప్పు మిల్లుల యజమానులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం ఏర్పాటైంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాన్ఫెలెక్స్లో భక్తుల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంతో పోలిస్తే వడ్డిస్తున్న అన్నప్రసాదం నాణ్యత, రుచి ఎంతో మెరుగుపడిందని 98 శాతానికి పైగా భక్తులు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి అన్నప్రసాద కేంద్రంలో బియ్యం మిల్లుల యజమానులు స్వయంగా భక్తులతో మాట్లాడగా, మెజారిటీ భక్తులు ఆహార నాణ్యతపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని అదనపు ఈవో వివరించారు.

అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పు వడ్డించాలని కొందరు భక్తులు సూచించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ సూచన సబబుగా ఉందని, దీనిపై సాధ్యసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పారదర్శకతను పెంచడానికి, నాణ్యతా ప్రమాణాలను బలోపేతం చేయడానికి ముడి సరుకుల సేకరణలో 'ఎంపానెల్మెంట్' విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన ప్రతిపాదించారు.
దీని ద్వారా భక్తులకు అందించే అన్నప్రసాద ప్రమాణాలను మరింత మెరుగుపరచడం తమ ఉద్దేశమని ఆయన వివరించారు. పప్పు ధాన్యాల సేకరణపై పప్పు మిల్లుల సంఘం ప్రతినిధులతో కూడా చర్చలు జరిపారు. నిబంధనల ప్రకారం అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకుల సరఫరాను నిర్ధారించేందుకు టీటీడీ ప్రత్యేక విధానాలను రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే టీటీడీ బోర్డు ముందు ఉంచి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 95,152 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 40,601 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.44 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పట్టింది. ఆ ఒక్కరోజే 2.83 లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరించారు. 4.21 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి.












Click it and Unblock the Notifications