కాదనడానికి నువ్వెవరు?: శిల్పాపై అఖిలప్రియ నిప్పులు, పొత్తులపై..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై మంత్రి, టిడిపి నేత అఖిలప్రియ శుక్రవారం నాడు తీవ్రస్తాయిలో మండిపడ్డారు.
నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై మంత్రి, టిడిపి నేత అఖిలప్రియ శుక్రవారం నాడు తీవ్రస్తాయిలో మండిపడ్డారు. శిల్పా వైసిపిలో చేరిన తర్వాత అఖిలప్రియ, ఆయన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
శుక్రవారం భూమా అఖిలప్రియ భూమా నాగిరెడ్డి, - శోభా నాగిరెడ్డి దంపతులకు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం టిడిపి అభ్యర్థి, సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డితో కలిసి ఆశీర్వాద యాత్ర సిద్ధమయ్యారు.
వారసుడు కాదనడానికి మీరెవరు?
నంద్యాలలోని 6వ వార్డులో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడారు. బ్రహ్మానంద రెడ్డి.. భూమా నాగిరెడ్డి వారసుడు కాదనడానికి శిల్పా మోహన్ రెడ్డి ఎవరని నిలదీశారు.
మాది ఉమ్మడి కుటుంబం
తాము అందరం కూడా కలిసే ఉన్నామని అఖిలప్రియ స్పష్టం చేశారు. తమది ఉమ్మడి కుటుంబమేనని, భూమా బ్రహ్మానంద రెడ్డి భూమా వారసుడేనని అఖిలప్రియ నొక్కి చెప్పారు.
పొత్తులపై చంద్రబాబుదే నిర్ణయం
నంద్యాల ఉప ఎన్నికల్లో పొత్తుల విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని అఖిలప్రియ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల 6వ వార్డులో భూమా అఖిల ప్రియ, బ్రహ్మానందరెడ్డి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు.
సవాళ్లు, ప్రతి సవాళ్లు
కొద్దిరోజుల క్రితం ఒకరికొకరు సవాల్ విసురున్నారు. నంద్యాలలో టిడిపి ఓడితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అఖిలప్రియ సవాల్ విసిరారు. ఆమె అదే మాట మీద నిలబడితే, మరోసారి చెబితే, తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శిల్పా అన్నారు.