కర్నూలు పోలీసులపై హెచ్ఆర్సీలో భూమా నాగిరెడ్డి కంప్లైంట్
హైదరాబాద్: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమా మంగళవారం హైదరాబాద్లోని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
ఇటీవల నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని చెప్పారు. ఒకే ఘటనలో తనపై మూడు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శాసనసభ సభ్యుడునని కూడా చూడకుండా తనపై రౌడీ షీటర్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు పోలీసులు తన పట్ల కక్ష పూరితంగా వ్యవహారిస్తున్నారని మానవ హక్కుల సంఘాన్ని కలిసిన భూమా నాగిరెడ్డి అన్నారు. గత నెలలో నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ ఘర్షణ నేపథ్యంలో భూమా నాగిరెడ్డిపై, వైసిపి కౌన్సిలర్లపై టిడిపి నాయకులు ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు మేరకు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. దీంతో, భూమా నాగిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనలో భూమా నాగిరెడ్డితోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 12 మందిపై టూటౌన్ రౌడీ షీటర్ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
వీరిలో కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్, కరీముల్లా, ఎం.కొండారెడ్డి, కృపాకర్లతోపాటు వైసీపీ నాయకులు చంటి, వడ్డె శ్రీను, వడ్డె మనోజ్ కుమార్, షేక్అజ్మీర్, ఏవీఆర్ ప్రసాద్, ఎస్.మధు అలియాస్ దేవనగర్ మధు, ఎంబీటీ బాబు, సి.నాగేశ్వర్ రావు ఉన్నారని ఏఎస్పీ వివరించారు.