చంద్రబాబుకు బెయిల్ పై భువనేశ్వరి స్పందన ఇదే!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజుల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత నేడు హైకోర్టు ఉత్తర్వుల మేరకు మధ్యంతర బెయిల్ తో బయటకు రావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు.
తాజాగా విజయనగరంలో రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన భువనేశ్వరి చంద్రబాబుకు బెయిల్ రావడంతో విజయనగరం నుంచి రాజమండ్రి కి బయలుదేరారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో తాను ముందు చంద్రబాబును చూడాలన్న భువనేశ్వరి రాజమండ్రి జైలుకు చేరుకున్నారు.

అంతకు ముందు చంద్రబాబు బెయిల్ పై స్పందించిన భువనేశ్వరి న్యాయం గెలిచింది.. జనం గెలిచారు అంటూ పేర్కొన్నారు. ఈ గెలుపు రాష్ట్ర ప్రజలందరిదీ అని, పోరాటం చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయం గెలవాలి యాత్ర కొనసాగించాలా వద్దా అనేది ఇంకా ఆలోచించలేదని, ముందు తన చంద్రబాబును చూడాలని పేర్కొన్నారు భువనేశ్వరి.
విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు బెయిల్ పై బయటకు రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తెలుగు తమ్ముళ్లు చేరుకున్నారు.
అయితే జైలు గేటు బయటనే వారందరిని ఆపడంతో కావాలని అనవసరపు ఆంక్షలు విధిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే రాజమండ్రి జైలు వద్దకు బాలకృష్ణ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, నారా వారి కుటుంబ సభ్యులు అందరూ చేరుకున్నారు. భారీ ర్యాలీగా చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు.












Click it and Unblock the Notifications