జనవరి 22 వరకు రుణవిముక్తి!: రిలీఫ్ ఇచ్చిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రైతులకు రుణమాఫీ పైన ఓ విధాన ప్రకటన చేశారు. ఈ నెల ఆరవ తేదీన రైతు రుణమాఫీ తొలి జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు. రుణమాఫీ ఎంతైనా భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అర్హుల జాబితాను ఆన్ లైన్లో పెడతామని తెలిపారు. జన్మభూమి గ్రామ సభల్లో జాబితా చదివి వినిపిస్తారన్నారు.
రూ.50వేల లోపు రుణవిముక్తి అయిన రైతులకు లేఖలు పంపిస్తున్నట్లు చెప్పారు. మొదటి దశలో రూ.50వేల రుణమాఫీ చేస్తున్నామని, ఇది ఈ నెల 10వ తేదీ నుండి వర్తిస్తుందని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు రెండో జాబితా పరిశీలన చేస్తామన్నారు. రెండో విడత జాబితాలో రైతులకు జనవరి 14 నుండి 22వ తేదీ వరకు తుది చెల్లింపు ఉంటుందన్నారు. 22వ తేదీ వరకు రైతులను రుణవిముక్తుల్ని చేస్తామని చెప్పారు.
రుణమాఫీకి ఆర్బీఐ ఒప్పుకోలేదని, కేంద్రం కూడా ఒక రాష్ట్రానికి ఇస్తే అన్ని రాష్ట్రాలు అడిగే అవకాశమున్నందున అంగీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో తాము ఎన్నో అధిగమించామన్నారు. 22 లక్షల 79వేల కుటుంబాలకు రుణ విముక్తి అవుతుందని చెప్పారు. రూ.50వేల లోపు రుణాలు ఉంటే ఒకేసారి మాఫీ అవుతాయని, ఎక్కువగా ఉంటే తొలుత రూ.50వేలు మాఫీ అవుతాయన్నారు. పండ్ల తోటలు ఉన్న వారికి రూ.10వేలు మాఫీ చేస్తామన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. గత పదేళ్లుగా రైతులు చాలా ఇబ్బంది పడ్డారని, తాను గతంలో పాదయాత్ర చేసి రైతుల సమస్యలు చూసి చాలా బాధపడ్డానని చెప్పారు. రైతుల రుణమాఫీ కోసం కోటయ్య కమిటీ వేశామని, వారు నివేదిక ఇచ్చారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తలెత్తుకొని తిరగాలన్నారు. రైతులకు రుణవిముక్తి కోసం రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు.
రుణమాఫీకి అర్హులైన ఏ వ్యక్తికి అన్యాయం జరగదని చెప్పారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో రూ.16వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని చెప్పారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.
రైతులు ఎన్నో కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. రైతు రుణ విముక్తి పథకం కోసం ఓ జీవో కూడా జారీ చేసినట్లు చెప్పారు. కుటుంబానికి రూ.1.5 లక్షల పంట రుణాల మాఫీ చేస్తామని చెప్పామన్నారు. బ్యాంకర్ల నుండి సమాచారం కోసం ఎంతో కసరత్తు చేశామన్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆధార్, రేషన్ కార్డులతో అనుసంధానం చేశామన్నారు.
ఏ వ్యక్తికి అన్యాయం జరగకుండా రుణమాఫీ చేస్తామన్నారు. గ్రామ కమిటీల ద్వారా క్రోడీకరించి లబ్ధిదారుల జాబితా తయారు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని ఆధారాలు సమర్పించిన వారికి రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని ఆధారాలు సమర్పించిన వారికి రుణ విముక్తి చేస్తున్నామన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్ సెల్ను సంప్రదించవచ్చునని తెలిపారు.
అర్హత ఉండి రుణమాఫీ జాబితాలో లేకుంటే మళ్లీ అవకాశం ఉంటుందన్నారు. 31-12-2103 వరకు తీసుకున్న రుణాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. 2007 నుండి రుణం తీసుకున్న వారికి రుణమాఫీతో పాటు వడ్డీ కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారి సమాచారం మళ్లీ సేకరిస్తామని చంద్రబాబు తెలిపారు. ఏ వ్యక్తికీ అన్యాయం జరగదన్నారు.
పంట రుణానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని, బంగారం రుణానికి మూడో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. భూమి పత్రాలు, సర్వే నెంబర్.. ఇలా అన్ని పరిశీలించి జాబితాను రూపొందించామని చెప్పారు. హార్టీ కల్చర్ వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు.