యథా కేంద్రం- తథా బ్యాంకులు-జగన్ సర్కార్ కు తాజా షాక్-రూ.6500 కోట్ల ఓడీకి ఎస్బీఐ నో
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్ధిక వ్యవస్ధ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా విచ్చలవిడిగా చేస్తున్న అప్పులకు కేంద్రం కూడా నో చెబుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకూ వర్తింపచేస్తోంది. దీనిపై ఆర్బీఐతో మార్గదర్శకాలు కూడా ఇప్పిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం తాజాగా కోరిన రూ.6500 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నో చెప్పేసింది. నిబంధనల ప్రకారం ఈ మొత్తం ఇవ్వలేమని ఎస్బీఐ తేల్చిచెప్పేసింది.

అప్పులాంధ్రప్రదేశ్
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాం నాటికే పేరుకుపోతున్న అప్పులకు, చంద్రబాబు ప్రభుత్వం ఆజ్యం పోసింది. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేయడం మొదలుపెట్టేసింది. ఈ అప్పుల ప్రస్ధానాన్ని వైసీపీ ప్రభుత్వం మరింతగా వాడుకోవడం మొదలుపెట్టింది. చంద్రబాబు అప్పు చేయగా లేనిది మేం చేస్తే తప్పా అంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకుకరావడం మొదలుపెట్టింది.
దీంతో చంద్రబాబు ఐదేళ్లలో చేసిన అప్పును వైసీపీ సర్కార్ సగం సమయంలోనే చేసేసింది. ఇది రాష్ట్ర ఆర్ధిక పరిస్దితిని తలకిందులయ్యేలా చేస్తోంది. కేంద్రం విధిస్తున్న పరిమితులు కూడా దాటిపోయి చేస్తున్న అప్పులతో రాష్ట్రంలో ప్రజలపై భారం ఏటికేడాది పెరుగుతూనే ఉంది అయినా వైసీపీ సర్కార్ ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్ధితులు కనిపించడం లేదు.

కేంద్ర ప్రాయోజిత పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్ర పథకాలకు కేటాయిస్తున్న నిధులను సొంత అవసరాల కోసం పీడీ ఖాతాలకు మళ్లించి వాడుకోవడం మొదలుపెట్టిందో అప్పుడే నిబంధనలు కఠినం కావడం కూడా మొదలయ్యాయి. కేంద్ర పధకాలకు ఇచ్చే నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించడం కుదరదంటూ కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పేసింది. ఈ నిధుల్ని ఆర్బీఐలోని మీ ప్రభుత్వ ఖాతాల్లో వేస్తామని, ఈ నిధుల్ని మీరు 21 రోజుల్లోగా ఈ పథకాల అమలుకు ఏర్పాటైన సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లోకి బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అంతటితో ఆగకుండా ఈ నిధులు బదిలీ అయిన 40 రోజుల్లో మీ వాటా డబ్పులు కూడా ఈ సింగిల్ నోడల్ ఏజెన్సీకి అందించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకునపడుతోంది.

రాష్ట్ర వాటా కోసం ఓవర్ డ్రాఫ్ట్ కు
కేంద్ర ప్రభుత్వం గతంలో తమ పథకాలకు విడుదల చేసే నిధుల్ని ముందుగా పీడీ ఖాతాలకు మళ్శించి వాడుకునే వారు. ఆ తర్వాత ఈ పథకం అమలుపై కేంద్రం నుంచి ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిని తిరిగి కేంద్ర పథకాలకు ఖర్చు చేసే వారు. అంతే కాదు ఈ నిధుల్ని చూపించి బ్యాంకుల్లో ఓవర్ డ్రాఫ్ట్ లు కూడా తెచ్చుకునే వారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు కేంద్రం నిబంధనలు కఠినతరం చేయడంతో ఆర్బీఐలోని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోనే కేంద్ర పథకాల నిధులు పడుతున్నాయి. వీటిని కచ్చితంగా నోడల్ ఏజెన్సీలకు బదిలీ చేయాల్సి వస్తోంది అంతే కాదు తమ వాటాగా ఇవ్వాల్సిన నిధుల కోసం తిరిగి కేంద్రం ఇచ్చిన నిధుల్ని సెక్యూరిటీగా భావించి ఓవర్ డ్రాప్డ్ ఇన్వాలని రాష్ట్రం కోరుతోంది. ఇక్కడే సమస్యలు ఎదురవుతువ్నాయి.

ఏస్బీఐని రూ.6500 ఓవర్ డ్రాఫ్ట్ కోరిన జగన్ సర్కార్
జగన్ సర్కార్ తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధుల్ని సింగిల్ నోడల్ ఏజెన్సీలకు మళ్లిస్తున్నందున ఆ మేరకు తమకు రూ.6500 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు నోడల్ ఏజెన్సీలకు బదిలీ అయి వెళ్లిపోతున్నందున వాటిని సెక్యూరిటీగా ఉంచుకుని రూ.6500 కోట్ల మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ గా కేటాయించాలని స్టేట్ బ్యాంక్ కు లేఖ రాసింది. దీంతో ఎస్బీఐ తాజాగా దానిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. ఇందులో కేంద్రం విధించిన నిబంధనల్ని సైతం ఏపీ సర్కార్ కు గుర్తు చేసింది.

జగన్ సర్కార్ కు ఎస్బీఐ షాక్
కేంద్ర ప్రాయోజిత పథకాలకు వచ్చే నిధుల్ని నోడల్ ఏజెన్సీలకు బదలాయిస్తున్నందున వాటిని సెక్యూరిటిగా ఉంచుకుని రూ.6500 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వాలన్న జగన్ సర్కార్ అభ్యర్ధనకు స్టేట్ బ్యాంక్ నో చెప్పేసింది. ఇందుకు నిబంధనలు అంగీకరించవని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సొంతగా ఏర్పాటు చేసుకుంటున్న కార్పోరేషన్లకు ఈ నిధుల విడుదల సాధ్యం కాదని తెలిపింది. విజయవాడ లేదా గుంటూరులోని తమ బ్యాంకుల్లో ఖాతాలు తెరిస్తే అప్పుడు ఈ మొత్తాన్ని విడుదల చేస్తామని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను, ఆర్బీఐ మార్గదర్శకాలను కూడా జగన్ సర్కార్ కు పంపింది. దీంతో అవాక్కవడం ప్రభుత్వం వంతయింది.

జగన్ సర్కార్ కు ముందునుయ్యి వెనుక గొయ్యి
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న అఫ్పులతో ఇప్పటికే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కుదేలవుతోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లు నిలిచిపోయాయి. కనీసం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని దొడ్డిదారిన వాడుకుందామంటే అదీ సాధ్యమయ్యేలా లేదు. అటు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నా అదనపు నిధుల రాక తగ్గిపోయింది. రాష్ట్ర వాటాగా వచ్చే జీఎస్టీ నిధులు, ఆర్ధిక సంఘం నిధులు మినహా కొత్తగా రూపాయి పుట్టడం లేదు. ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్తున్నా అది కాస్తా పాత వడ్డీలకు సరిపోతోంది.
ఇప్పుడు బ్యాంకులు కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చేందుకు నిరాకరిస్తుండటం జగన్ సర్కార్ కు ఉన్న కాస్తో కూస్తో వెసులుబాటును కూడా దూరం చేసేస్తోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే రాబోయే రోజులు మరింత కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అలాగని కేంద్రంపై ఒత్తిడి పెంచే పరిస్ధితులూ లేవు. దీంతో జగన్ సర్కార్ పరిస్ధితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారిపోతోంది.












Click it and Unblock the Notifications