జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్- ఏకంగా 102 పిటిషన్ల కొట్టివేత-ఎందుకో తెలుసా ?
ఏపీలో ఉపాధి హామీ పథకం కింద గతంలో చేసిన పనులకు గానూ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల వ్యవహారంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన వందకి పైగా రివ్యూ పిటిషన్లను హైకోర్టు ఇవాళ కొట్టేసింది.
ఏపీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు గానూ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల్ని చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ బిల్లులు చెల్లించాల్సిందేనని పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా అధికారులు లెక్క చేయలేదు. చివరికి హైకోర్టు బాధ్యులైన అధికారుల్ని న్యాయస్దానానికి పిలిపించి మరీ చీవాట్లు పెట్టింది. అయినా ఇంకా పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ బిల్లుల చెల్లింపును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు కోసం హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం ఏకంగా 102 రివ్యూ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిని జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం విచారించింది. గతంలో కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వలేకపోయామని, కొన్ని బిల్లులు అదనంగా ఉన్నాయని, అందువల్ల రివ్యూ పిటిషన్లు వేస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే బిల్లులు ఇప్పటికే ఎంబుక్ ఆధారంగా సీఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేశాక... ఇప్పుడు రివ్యూ ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం 102 రివ్యూ పిటిషన్లను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.