పులివెందులలో రూ.53 లక్షలు చోరీ, బాలికను పొలాల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్
కడప: పులివెందుల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సోమవారం ఉదయం భారీ దోపిడీ జరిగింది. ఏటీఎంలలో డబ్బులు పెట్టేందుకు వెళ్తున్న వ్యాన్ను అడ్డగించి ఉద్యోగుల పైన కారంపొడితో దాడి చేసి డబ్బులు దోచుకెళ్లారు. ఈ సంఘటన పట్టపగలే జరిగింది.
లాగి క్యాష్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న విక్రమ్, శ్రీనులు పులివెందుల ఎస్బీఐ బ్యాంకు నుంచి రూ.53లక్షలు డ్రా చేశారు. నగదును సూట్కేసులో పెట్టుకుని ద్విచక్రవాహనంపై పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, టీవీఎస్ షోరూం సమీపంలోని ఏటీఎంలలో డబ్బులు పెట్టేందుకు వెళ్తున్నారు.
దీనిని పసిగట్టిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడికి దిగారు. కారం పొడి చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేశారు. నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. దుండగుల దాడిలో గాయపడిన బాధితులను పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాలికపై అత్యాచారం
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని విపరింతలపాడులో దారుణం జరిగింది. పద్నాలుగేళ్ల బాలికను జాన్ బాషా, అతని స్నేహితులు ముగ్గురు కలిసి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. పదో తరగతి పరీక్షలు రాసిన ఆ బాలిక ఈ మధ్యే ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.
విధులు నిర్వర్తించి ఇంటికి వస్తున్న బాలికను అడ్డుకున్న నిందితులు ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అటుగా మనుషులు వస్తున్న అలికిడి కావడంతో ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యారు. ఆ తర్వాత అటుగా వచ్చిన గ్రామస్థులు బాలికను గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాణసంచా పేలి ఇద్దరు మృతి
శ్రీకాకుళం జిల్లాలోని గురువాం గ్రామంలోని ఓ ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. చంద్రరావు ఇంట్లో నిల్వ చేసిన బాణసంచాకు ప్రమాదవశాత్తూ నిప్పంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను రాజాం ఆస్పత్రికి తరలించారు.
చంద్రబాబుకు విష్ణు కుమార్ రాజు లేఖ
ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం లేఖ రాశారు. విశాఖలోని బ్రాండెక్స్లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లోని బ్రాండెక్స్లో వేతనాలు, పీఎఫ్ బకాయిల కోసం మహిళా కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో కంపెనీలో కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రప్తావిస్తూ చంద్రబాబుకు విష్ణు కుమార్ రాజు లేఖ రాశారు. తక్కువ వేతనాలు ఇస్తూ బ్రాండెక్స్ మహిళా కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, తక్కువ వేతనాలైనా సరైన సమయానికి ఇవ్వకుండా ఆ కంపెనీ యాజమాన్యం ఇబ్బందులు పెడుతోందన్నారు. తక్షణమే స్పందించి మహిళా కార్మికులకు న్యాయం చేయాలని చంద్రబాబును కోరారు.