ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం: అక్కడ మూడు నెలలు చికెన్ అమ్మకం నిషేధం!!
బర్డ్ ఫ్లూ .. పక్షుల ప్రాణాలు తీసే వైరస్. ఈ వైరస్ గతంలో కేరళ, మహారాష్ట్రలలో విజృంభించింది. తెలుగు రాష్ట్రాలలో సైతం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ముఖ్యంగా గతంలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగారు . కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ ను తీసుకుని భోపాల్ లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు.

అయితే కోళ్లు చనిపోయిన తీరు బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్టుగా ఉండడంతో అధికార యంత్రాంగం బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు చేపడుతుంది. సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తుంది. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో తాజాగా వేలాది కోళ్లు చనిపోయాయి. వీటిని పరిశీలించిన పశుసంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు.
అలాగే చనిపోయిన కోళ్ళను పాతి పెట్టారు. ఈ క్రమంలో కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీల పరిధిలోని ప్రాంతాల్లో మూడు రోజులపాటు చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఒక కిలో మీటర్ పరిధిలోని ప్రాంతాల్లో చికెన్ షాపులు 3 నెలల పాటు మూసివేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎక్కడైనా కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోతే పశు సంవర్ధక శాఖాధికారులకు సమాచారం అందించాలని, చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్దేశించారు. బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరిస్తున్న వార్తల నేపథ్యంలో స్థానిక ప్రజలు చికెన్ తినాలి అంటేనే భయపడుతున్నారు












Click it and Unblock the Notifications