మిత్రపక్షమైనందునే ఓపిక పట్టాం, అవినీతి పెరిగింది: విష్ణుకుమార్ రాజు
విశాఖపట్టణం: బిజెపి, పవన్ కళ్యాణ్ అండతోనే ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిందని బిజెపి శాసనసభపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీల అండ లేకపోతే టిడిపి పరిస్థితి మరోలా ఉండేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీలో టిడిపి, బిజెపి మధ్య మిత్రుత్వం తెగింది. దీంతో స్వతహగా బలాన్ని పెంచుకొనేందుకు బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీకి చెందిన బిజెపి నేతలు రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
మరో వైపు ఏపీకి బిజెపి ఇంచార్జీగా రామ్ మాధవ్ను నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ తరుణంలో ఆదివారం నాడు విశాఖపట్టణంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో బిజెపి శాసనసభపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు టిడిపిపై విమర్శలు గుప్పించారు.
ఏపీ రాష్ట్రంలో టిడిపితో తమ పార్టీ మిత్రపక్షంగా ఉన్నందునే ఇంత కాలం పాటు తాము ఏమీ అనలేదని ఆయన చెప్పారు.అంతేకాదు సంయమనంతో వ్యవహరించామని విష్ణుకుమార్ రాజు చెప్పారు. విశాఖపట్టణంలో జరిగిన భూ కుంభకోణాలు తన వల్లే బయటకు వచ్చాయని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
విశాఖ భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు తానే కారణమయ్యాయని ఆయన చెప్పారు. ఏపీలో ప్రస్తుతం బిజెపి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించనున్నట్టు ఆయన చెప్పారు.ఏపీ రాష్ట్రంలో టిడిపి నాయకుల అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. ఇసుక మాఫియాను టిడిపి పెంచిపోషిస్తోందని ఆయన ఆరోపించారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం అన్ని రకాలుగా చర్యలు తీసుకొంటుందని చెప్పారు.