బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు, ఎవరెక్కడ - "ఫలితం" దక్కేదెవరికి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్య సీట్ల ఖరారు పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇదే సమయంలో కొన్ని మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. బిజెపి తమ పార్టీ నుంచి పోటీ చేసే పదిమంది ఎమ్మెల్యేలు అభ్యర్థులను ఫైనల్ చేసింది. బిజెపి ఎంపిక చేసిన అభ్యర్థుల పైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హోరా హోరీ పోరు : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా మారుతుంది. పొత్తు లెక్కల్లో భాగంగా టిడిపి 144 స్థానాలు, జనసేన 21, బిజెపి 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ పోటీ చేయనుంది. టిడిపి ఇప్పటికే 139 మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 18 మందిని ప్రకటించగా, మరో ముగ్గురిని ఫైనల్ చేయాల్సి ఉంది. బిజెపి తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో ఎంపిక మాత్రం అనూహ్యంగా కనిపిస్తుంది. ఎంపీలుగా సీట్లు ఆశించి భంగపడిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించింది. బిజెపి పొత్తులో భాగంగా తమకు కేటాయించిన పది స్థానాల అభ్యర్థులను ఈరోజు అధికారికంగా ప్రకటించనుంది. అనుహియంగా విజయవాడ పశ్చిమం నుంచి బిజెపి నేత సుజనా చౌదరి పేరు ఖరారు అయినట్టు తెలుస్తుంది.

సీట్ల ఖరారు : సుజనా చౌదరి ఏలూరు సీటు బిజెపికి దక్కితే అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. విజయవాడ సీటు పైన ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే విజయవాడ ఎంపీ స్థానం ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. ఫలితంగా విజయవాడ పశ్చిమం నుంచి సృజనా చౌదరి బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ జనసేన నేత పోతిన మహేష్ ఈ సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ బిజెపి వర్గాల సమాచారం ప్రకారం ఈ సీటు సుజనా చౌదరికి ఖాయమైంది. అదేవిధంగా ధర్మవరం స్థానం బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు ఖాయమైనట్టు తెలుస్తుంది. ధర్మవరం సీటు పైన టిడిపి నుంచి పరిటాల శ్రీరామ్, బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి చివరి వరకు ప్రయత్నాలు చేశారు. పొత్తులో అనంతపురం ఎంపీగా పోటీ చేయాలని సత్యకుమార్ భావించారు. కానీ బిజెపికి అనంతపురం సీటు దక్కకపోవడంతో ఇప్పుడు ధర్మవరం నుంచి పోటీ చేసేందుకు సత్యకుమార్ సిద్ధమయ్యారు.

అభ్యర్థులు ఎవరెక్కడ : కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేయటం ఖాయమైంది. కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తుంది. విశాఖ నార్త్ నుంచి మరోసారి విష్ణుకుమార్ రాజు పోటీ చేయనున్నారు. అదేవిధంగా ఎచ్చర్ల నుంచి నడికుదుటి ఈశ్వరరావు, పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు, ఆదోని నుంచి పార్థసారథి, బద్వేలు రిజర్వ్ నియోజకవర్గం నుంచి సురేష్ పేర్లు ఖరారు అయినట్లు సమాచారం. అయితే ఇప్పటికే టిడిపి ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్థానం తాజాగా బిజెపికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అనపర్తి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థి ప్రకటన కూడా పూర్తయింది. కానీ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు అక్కడి నుంచి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీర్రాజుకు అనపర్తి స్థానం ఇవ్వటాన్ని రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. సోము వీర్రాజుని కైకలూరు నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీలో సూచన వస్తుంది. కానీ, అక్కడి నుంచి బరిలోకి నిలిచేందుకు వీర్రాజు సిద్ధంగా లేరు. ఈ ఎంపిక ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలకు కారణమవుతుందనే చర్చ మొదలైంది. దీంతో బిజెపి ప్రకటించే తుది జాబితా పైన ఇప్పుడు మూడు రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications