బీజేపీ, వైసీపీ డిష్యుం డిష్యుం!
భారతీయ జనతాపార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య జరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో పోరు యాత్ర చేస్తున్న బీజేపీ నాయకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు దాడులకు దిగారు. బొమ్మనహాళ్ మండలం దేవగిరిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ప్రజాపోరు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు బీజేపీ శ్రేణులపై దాడికి దిగాయి. పోరుయాత్ర యాత్రకు ఏర్పాటు చేసిన మైక్ ను కూడా విరిచేశారు. గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న వెంటనే బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు బొమ్మనహల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రోద్భలంతోనే దాడులు జరిగాయని మీడియాకు వివరించారు.
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నవైసీపీ శ్రేణులకు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి జోగి రమేష్ సత్యకుమార్పై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా వివిధ జిల్లాల్లో ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. పై స్థాయిలోని నేతలు మాటలతో విరుచుకుపడుతుండగా, కిందిస్థాయిలో శ్రేణుల మధ్య భౌతిక దాడులు జరుగుతున్నాయి. వివాదం వద్దని, ఏమైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందామని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. వివాదాలు పెద్దవి కాకుండా చూడాల్సిన బాధ్యత ఇరుపార్టీలోని అగ్ర నాయకత్వంపై ఉంది. వారేం చేస్తరో చూడాలి.