ఫేక్ న్యూస్..దేనికైనా వెనుకాడం: టాప్ తెలుగు న్యూస్ ఛానల్కు ఏపీ బీజేపీ నేతల వార్నింగ్..!
అమరావతి: రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఓ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం సహా కొన్ని మీడియా సంస్థలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ సహ ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్ హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఏకపక్షంగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే తాము రిజాయిండర్లు ఇచ్చినప్పటికీ.. ఏ మాత్రం ఖాతరు చేయట్లేదని పేర్కొన్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే.. ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని అన్నారు.
ఈ మేరకు సునీల్ దేవ్ధర్ ఓ ట్వీట్ చేశారు. తమ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సహా మరికొందరు నాయకులకు వ్యతిరేకంగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ సహా కొన్ని వార్తా సంస్థలు నకిలీ వార్తలను సృష్టిస్తున్నాయని అన్నారు. నకిలీ రిపోర్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు వార్తలను ప్రసారం చేసి, బీజేపీ నాయకులపై దుష్ప్రచారాన్ని చేస్తోన్న అలాంటి ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు.
మా జాతీయ అధికార ప్రతినిధి @gvlnrao గారికి వ్యతిరేకంగా కొన్ని వార్తా సంస్థలు చేసిన నకిలీ రిపోర్టింగ్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పుడు వార్తలు ప్రసారం చేసి బీజేపీ నాయకులపైన దుష్ప్రచారం చేసే ABN లాంటి చానెల్స్ పై చట్టపరమైన చర్యలకు వెనుకాడము.@klnbjp @yschowdary @CMRamesh_MP pic.twitter.com/hvjhbC4OhA
— Sunil Deodhar (@Sunil_Deodhar) March 5, 2020
Recommended Video
జీవీఎల్పై పూర్తిగా అసత్యాలతో కూడిన కథనాన్ని ఆ ఛానల్ ప్రసారం చేసిందని సునీల్ దేవ్ధర్ అన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జీవిఎల్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని అవాస్తవ కథనాన్ని ప్రసారం చేశారని అన్నారు. దీనికి ఆ ఛానల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పత్రికా, మీడియా విలువలను విస్మరించి తరచూ బీజేపీపై అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తుస్తోందని విమర్శించారు. తమ వైఖరిని మార్చుకోకపోతే ఆ ఛానల్ చర్చలను బహిష్కరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.