కన్నా అత్యుత్సాహం.. చిక్కుల్లో పడ్డ బీజేపీ
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శతృవులు ఉండరనేది ఓ ప్రాథమిక సూత్రం. దేశ, రాష్ట్రస్థాయి రాజకీయాలన్నీ ఈ పాయింట్ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎవరు? ఎప్పుడు? ఎన్నాళ్లు.. ఏ పార్టీలో ఉంటారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ రక్తాన్ని నరనరాన నింపుకొన్న కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు వంటి నాయకులు పార్టీని వీడిన సందర్భతానికి ఈ పాయింటే కేంద్ర బిందువైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం పాలైన తరువాత భారతీయ జనతాపార్టీకి డిమాండ్ బాగా పెరిగిందని, తమ పార్టీ నుంచి వలసలు మరింత పెరిగే అవకాశం లేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.
తెర వెనుక దోస్తీ
అధికారాన్ని కోల్పోయిన తరువాత.. బీజేపీ, టీడీపీ తెర వెనుక జట్టుకట్టాయని అంటున్న వారి సంఖ్య కాస్త పెద్దదే. అధికారంలో ఉన్న సమయంలో పలు అంశాల్లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆ పార్టీని ఏకిపడేసిన కన్నా లక్ష్మీ నారాయణ.. తన గళాన్ని మార్చారు. చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని, దీనికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? అంటూ చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ చిందులు తొక్కారు. చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓటమి తరువాత కన్నా గళంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన తన గళాన్ని, విమర్శలను ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైకి సంధిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ విజయసాయి రెడ్డి సైతం కన్నా లక్ష్మీనారాయణను `చంద్రబాబు పార్ట్నర్`గా సంబోధించారు.
చంద్రబాబుకు వరుస లేఖలు..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడి హోదాలో కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి పలు బహిరంగ లేఖ రాశారు. నాలుగేళ్లలో ఎన్ని వాగ్దానాలు అమలు చేశారని ప్రశ్నిస్తూ వరుస లేఖలను సంధించారు. చంద్రబాబుకు తాను అయిదు ప్రశ్నలను సంధిస్తున్నానని ప్రకటించిన కన్నా..అనంతరం తన గళాన్ని మార్చారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, ఆ వెంటనే కొద్దిరోజుల వ్యవధిలో పలువురు టీడీపీ కీలక నాయకులు పార్టీ కండువాను కప్పుకొన్నారు. దీని ప్రభావంతో.. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి అనుకూలుడైపోయారని అంటున్నారు ప్రత్యర్థులు. ఫలితంగా- తాను స్వయంగా డిమాండ్ చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సీబీఐ విచారణ అంశం తెరమరుగైంది. పైగా- పీపీఏలను పున:సమీక్షించడం వల్ల పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతాయని, పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలు వ్యక్తమౌతాయని బీజేపీ నాయకులు చెబుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పున:సమీక్షలపై నాడు సై..నేడు నై
విద్యుత్ ఉత్పత్తిలో బ్రహ్మాండమైన ప్రగతిని సాధించామని కోతలు కోసిన చంద్రబాబు.. ఈ నాలుగు సంవత్సరాలలో అదనపు విద్యుత్తు కొనుగోళ్లపై ప్రభుత్వం చేసిన ఖర్చు, వసూలు చేసిన కమీషన్ల పై సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది. జెన్ కో ఆధీనంలోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని, ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచకుండా, ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లపై ఎందుకు ఆసక్తి చూపారో ప్రజలటి వివరించగలరా? అంటూ చంద్రబాబును సవాల్ విసిరారు. ఈ నాలుగు సంవత్సరాలలో ఈ విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం మీ కుమారుని కనుసన్నలలో జరిగిన మాట వాస్తవం కాదా? దీనిపై సిబిఐ విచారణకు సిద్ధమా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసిన ఇవే అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తుండగా.. వద్దు వద్దంటూ కన్నా గగ్గోలు పెడుతున్నారని, ఈ విషయం బీజేపీని ఇరకాటంలో నెట్టినట్టవుతోందని చెబుతున్నారు.