పొత్తులపై బీజేపీ డిసైడ్ అయిందా - ఏపీలో అనూహ్య మలుపు..!!
ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అటు కాంగ్రెస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించి కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దీంతో, ఇప్పుడు బీజేపీ అలర్ట్ అయింది. పొత్తుల పైన తేల్చకుండానే తమ కార్యాచరణ మొదలు పెట్టింది. పార్టీ అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించింది. 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి సిద్దమవుతోంది.
ఒంటరి పోరు దిశగా: ఏపీలో బీజేపీ దాదాపు ఒంటరి పోరుకే నిర్ణయించినట్లు కనిపిస్తోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ నేతల సూచనల మేరకు రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గురువారం ఒకే రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్సభ స్థానాల పరిధిలో పార్టీ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తోంది. . బీజేపీకీ 'రాష్ట్రంలో ఒక్క అవకాశం - కేంద్రంలో మరో విడత' నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం మోదలు పెట్టింది. ఇదే సమయంలో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్దుల ఎంపిక కసరత్తు ప్రారంభించింది.
అభ్యర్దుల ఎంపిక: 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు 2,438 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జాతీయ పార్టీ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్తో జరిగిన రాష్ట్ర ముఖ్యనేతల భేటీలో లోక్సభ స్థానాల్లో పోటీకి అవకాశం ఉన్న నాయకులు, పార్టీ బలాబలాలపై చర్చించారు.
రాజ్యసభ సభ్యులు జీవీఎల్, సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులతో పాటు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న పరిపూర్ణానంద స్వామి కూడా లోక్సభ బరిలో నిలిచేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ముఖ్య నేతల రాక: ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత పార్టీ అగ్రనేతలు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, జెపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. క్లస్టర్ల వారీగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పలు జిల్లాల్లో ప్రాంతంలోని వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపారు.
జాతీయ, రాష్ట్ర పార్టీ సులభంగా పర్యవేక్షించేలా ఐదేసి లోక్సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్గా విభజించి, 5 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో, బీజేపీ ఒంటరి పోరుకే సిద్దమవుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ పొత్తుకు ముందుకు రాకపోతే పవన్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. దీని ద్వారా బీజేపీకి దక్కే ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications