బెంగళూరులో త్రిబుల్ మర్డర్- అమ్మను సైతం కనికరించలేని డ్రైవర్
బెంగళూరులో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. త్రిబుల్ మర్డర్ ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. నెలరోజుల కిందట కృష్ణరాజపురంలో ముగ్గురి దారుణహత్య సంభవించిన తర్వాత.. మళ్లీ అలాంటి సంఘటనే కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కుటుంబ సభ్యులను చంపాడు ఓ డ్రైవర్. తల్లిని సైతం బలి తీసుకున్నాడు. చివరికి.. తప్పించుకునే దారి లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హంతకుడి పేరు ప్రశాంత్. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్టిగెపాళ్య నివాసి. వయస్సు 34 సంవత్సరాలు. వృత్తిరీత్యా డ్రైవర్. ఏడెనిమిది సంవత్సరాలుగా కొట్టిగెపాళ్యలోని గణేషుడి ఆలయం సమీపంలో అద్దెకు నివసిస్తోన్నాడు. దాదాపుగా ఏడాదికాలంగా ఏ పనీ చేయట్లేదు. ఇంట్లోనే ఖాళీగా ఉంటోన్నాడు. పితృార్జితంగా వచ్చిన ఆస్తితో జీవనం కొనసాగిస్తోన్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయ్యాడు.

దీంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఏదైనా పని చేసుకోవాలంటూ తల్లి మంగళమ్మ తరచూ గొడవ పడుతుండేది. ఈ ఉదయం కూడా ఇంట్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో తల్లిపై చేయిచేసుకున్నాడు ప్రశాంత్. ఈ విషయం అతని మేనమామ సతీష్ కు తెలియడంతో ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఆగ్రహంతో ప్రశాంత్ ఇంట్లో మచ్చు కత్తితో తల్లిపై దాడి చేశాడు. పొడిచి చంపాడు. అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాయనమ్మ నంజమ్మ, మామ సతీష్ ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
వారు కేకలు విని ఇరుగు పొరుగు వారు అక్కడికి వచ్చి ప్రశాంత్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇక తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ప్రశాంత్ ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టమ్ కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications