టీడీపీ - జనసేన పొత్తు వేళ కొత్త ట్విస్ట్ : ఢిల్లీలో నయా రాజకీయం..!!
ఏపీలో టీడీపీ -జనసేన పొత్తు ఉంటుందా..ఉండదా. సంకేతాలు క్లియర్ గా ఉన్నా కొన్ని సందేహాలు వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలపైన కొత్త వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. విశాఖ పరిణామాల తరువాత విజయవాడ హోటల్ లో బస చేసిన పవన్ కళ్యాణ్ వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు సడన్ ఎంట్రీ ఇచ్చారు. అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా పని చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఇందుకోసం మళ్లీ మళ్లీ కలుస్తామంటూ స్పష్టం చేసారు. కానీ, ఇది భవిష్యత్ ఎన్నికల పొత్తులో వేసిన తొలి అడుగుగా రెండు పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు.
రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా.. మధ్యలో బీజేపీతో ఏం చేయాలనేది ఇప్పుడు అటు చంద్రబాబు..ఇటు పవన్ కళ్యాణ్ కు సమస్యగా మారుతోంది. చంద్రబాబు తరహాలో మూడు పార్టీలు కలిసి జగన్ ను గద్దె దింపేందుకు ఏకం కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం అంది వచ్చిన ఏ అవకాశాన్ని విడుచుకోవటం లేదు. బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని..జనసేనతో మాత్రమే పొత్తు కొనసాగుతుందని చెబుతున్నా..ఢిల్లీ వేదికగా ముఖ్య నేతలను ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో కటీఫ్ గురించి ఎక్కడా నేరుగా చెప్పటం లేదు. బీజేపీతో కొనసాగింపు పైన అంత సుముఖంగా లేరు. కానీ, ప్రధాని - అమిత్ షా మూడ్ స్పష్టమయ్యే వరకూ వేచి చూడాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కానీ, ఢిల్లీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ పరిణామాల పైన ఏపీ బీజేపీ ముఖ్య నేత తాజాగా బీజేపీ నాయకత్వంలో రెండో స్థానంలో ఉన్న నేతతో చర్చించారు. పవన్ కళ్యాణ్ బీజేపీని వీడి..టీడీపీతో పొత్తుకు సిద్దమవుతున్నరనే అంశం పైన చర్చ జరిగినట్లు వివరించారు. ఈ మొత్తం పరిణామాల పైన ఆరా తీసిన ఆ ముఖ్య నేత పొత్తుల గురించి ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని..ఎటువంటి కొత్త ప్రతిపాదనలు చేయవద్దంటూ తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. జనసేనతో పొత్తు ఉంటుందని..పవన్ జారి పోకుండా చూసుకోవాలని ఆ ముఖ్య నేతకు సూచించారని తెలుస్తోంది. ఎన్నికల లోగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేవని..ఢిల్లీ బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆ నేత స్పష్టం చేసారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని వీడకుండా కొత్త వ్యూహం అమలు చేసే దిశగా బీజేపీ కొత్త కార్యచరణ సిద్దం చేస్తోంది. కానీ, ఇప్పటికే పవన్ దాదాపుగా బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు బీజేపీ నేతలు పవన్ తో దోస్తి కొనసాగింపుకు ప్రయత్నాలు చేసినా, అందుకు జనసేనాని అంగీకరిస్తారా అనేది సందేహమే. కానీ, జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనేది పవన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. చంద్రబాబు కూడా జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో..ఈ మూడు పార్టీల పొత్తులు..చోటు చేసుకొనే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications