ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలో ఒక అంచనాకు వచ్చిన బీజేపీ?
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏపీలో విభిన్నమైన మార్గంలో పయనించబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కేంద్రంలోని భారతీయ జనతాపార్టీని అత్యవసర సమయాల్లో ఆదుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లోను ద్రౌపది ముర్ముకే మద్దతివ్వబోతున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలా అండగా నిలిచిన పార్టీకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి బీజేపీ ఏం చేయబోతుందనేది అతి త్వరలోనే ఒక స్పష్టత రానుందనేది ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఫిర్యాదు చేసిన పవన్ కల్యాణ్?
ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆర్థికంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందంటూ కేంద్ర ఆర్థికశాఖ ఇచ్చిన నివేదికను కూడా బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడంవల్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉత్పన్నమవుతున్న వ్యతిరేకత ప్రభుత్వంపై తీవ్రంగా ఉందని అంచనా వేస్తున్నారు.

వైసీపీలో కలిసి వెళ్దామంటూ రాష్ట్ర బీజేపీ నేతల ఒత్తిడి?
రాబోయే ఎన్నికలకు వైసీపీతో కలిసి వెళ్దామని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. 10 నుంచి 15 వరకు ఎమ్మెల్యే స్థానాలను గెలవడంతోపాటు ప్రభుత్వంలో చేరడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ దీనిపై ఇంతవరకు ఢిల్లీ పెద్దలు ఏమీ స్పందించలేదు. రాష్ట్రపతి ఎన్నికలైన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ కేంద్రంపై ఒత్తిడి చేస్తుండటం, జేపీ నడ్డా, నరేంద్రమోడీ పర్యటనలకు ఆయన డుమ్మా కొట్టడం కూడా వారిని ఆలోచనలో పడేసిందంటున్నారు.

పవన్ అభిప్రాయాన్ని గౌరవించాలా? లేదంటే..
జనసేనాని అభిప్రాయాన్ని గౌరవించి ఆ ప్రకారం వెళితే ప్రజల్లో పార్టీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందని, అలా కాకుండా వైసీపీకి అనుకూలంగా వెళితే ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి అంటూ ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీనిపై మల్లగుల్లాలు పడుతున్న ఢిల్లీ వర్గాలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్రపతి ఎన్నికల వరకు వేచిచూడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికలైన తర్వాతే అవసరమైతే కొంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకొని పార్టీపై ప్రజల్లో మంచి అభిప్రాయం వ్యక్తమయ్యేలా చూడాలనే నిర్ణయానికి రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications