అక్కడ తెగదెంపులు, టీడీపీని వదులుకోలేం: బీజేపీ మంత్రి సంచలనం, అనితది నిజమేనని విష్ణు
అమరావతి: బీజేపీ నేత, ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు సోమవారం తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తెలుగుదేశం పార్టీని వదులుకునే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Recommended Video
చదవండి: బాబుకు రివర్స్: బీజేపీ మంత్రుల రాజీనామా? మిస్టర్ సీఎం.. విష్ణు సంచలనం, గల్లాకు కౌంటర్
ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పలు పార్టీలు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్, ఒడిశాలో బీజేడీ దూరమయ్యాయని, దూరమవుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తును తెంచుకునే పరిస్థితుల్లో లేమని ఆయన అభిప్రాయపడ్డారు.
చదవండి: ఏపీకి వస్తానంటే నో చెప్పారు: మోడీకి బాబు షాక్, ఆసక్తికర అంశాలు, కారణాలివీ
నిమిషంలో రాజీనామా
తాము తమ పార్టీ అధిష్టానానికి రెండు ఆప్షన్లు ఇచ్చామని మాణిక్యాల రావు చెప్పారు. పార్టీ ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా చేస్తామని ఆయన అన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
టీడీపీతో పొత్తు లేకున్నా నష్టం లేదు కానీ
ఏపీలో టీడీపీతో పొత్తు లేకపోయినా బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని మాణిక్యాల రావు అన్నారు. మేము ఇక్కడ వెంట్రుక లాంటి వారమని, కొండకు వెంట్రుక వేసి లాగుతున్నారని వాపోయారు. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. మిగిలిన రాష్ట్రాల్లో తెంచుకున్నామన్నారు. కచ్చితంగా టీడీపీ వెళ్తామంటే తమతో కలిసేందుకు మరొకరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
విష్ణు కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ టీడీపీ మద్దతుతో గెలిచారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మిత్రపక్షాల అభ్యర్థిగా మాధవ్ పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో ఉండాలా వద్దా అనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
మాకు ఆ కుసంస్కారం లేదు
ఆదివారం బీజేపీ పదాదికారుల భేటీలో మంత్రుల రాజీనామాలపై ఒకరిద్దరు మాత్రమే స్పందించారని విష్ణు చెప్పారు. టీడీపీ, బీజేపీ పొత్తు విషయమై చంద్రబాబు, అమిత్ షాలు నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు. తమ పార్టీ ఏపీ అధ్యక్షులు హరిబాబు చాలా సౌమ్యుడు అని, మిస్టర్ ప్రైమినిస్టర్ అనే కుసంస్కారం తమకు లేదన్నారు. వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. పోలవరంపై కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
అవమానిస్తే ఓర్చుకున్నాం
అంతకుముందు, టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ.. బీజేపీ ఎన్ని అవమానాలు చేసినా భరిస్తూ వచ్చామని చెప్పారు. టిడిపి మద్దతుతోనే మాధవ్ గెలిచారన్నారు. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. మాధవ్కు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. టీడీపీ మద్దతుతో గెలవడం వల్లే బీజేపీకి 5 సీట్లు వచ్చాయన్నారు. బీజేపీ మంత్రులు కేబినెట్ నుంచి తొలగుతామంటే తామేం బతిమాలమని చెప్పారు.