నా వివరణ అడిగి కేసు పెడితే బాగుండేది.. అలా ఎందుకు చేయలేదు?
సోము అస్వస్థతకు లోనై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. అవి బాగా వైరలయ్యాయి
భారతీయ జనతాపార్టీలో నిన్నటి వరకు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం హాట్ హాట్ గా ఉండేది. పార్టీ అగ్రనేత శివప్రకాష్ జీ కన్నాతో భేటీ అయిన తర్వాత వివాదం సద్దుమణిగింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో మరో అంశం దుమారం రేపుతోంది. సోము వీర్రాజు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన సమయంలో ఇది జరిగింది.

సోము మరణించాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్
సమావేశాల్లో పాల్గొనడానికి హస్తిన చేరగానే సోము అస్వస్థతకు లోనై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. అవి బాగా వైరలయ్యాయి. ఈ విషయంలో ఏపీ బీజేపీలో కలకలం రేకెత్తిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ నాయకత్వం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ న్యూస్ వైరల్ చేసినవారిలో బాలుశ్రీ (తణుకు), యారగడ్డ రాంకుమార్ (కాకినాడ) ఉన్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రమేమిటంటే బీజేపీ అనుబంధ విభాగం కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గంలో రాంకుమార్ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ ఏపీ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

సోము వైఖరిని వ్యతిరేకించే రాంకుమార్
సోము వీర్రాజు వ్యవహారశైలిని, ఆయన నిర్ణయాలను రామ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించేవాడు. బహిరంగంగా కాకపోయినప్పటికీ పార్టీ నేతల సమక్షంలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారని తెలుస్తోంది. సొంత పార్టీవారిమీదే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అయితే సోము వీర్రాజు వర్గం చెబుతోంది ఏమిటంటే.. రాంకుమార్ బీజేపీ నాయకుడైనా మనసు మాత్రం టీడీపీతో ఉంటుందని, టీడీపీతో పొత్తుండదని చెప్పిన ప్రతిసారి కామెంట్స్ చేస్తుంటారని, పార్టీ ప్రయోజనాలకంటే పక్క పార్టీ ప్రయోజనాలే రాంకుమార్ కు ప్రధానమని చెబుతోంది.

నా వివరణ ఎందుకు అడగలేదు?
పోలీసులకు ఫిర్యాదు చేసేముందు తన వివరణ ఎందుకు అడగలేదని రాంకుమార్ ప్రశ్నిస్తున్నారు. ఆయన పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతుంటే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సోము వర్గం ఎదురు ప్రశ్నిస్తోంది. పార్టీలో ఉందే పదిమంది నేతలని, గొడవలు మాత్రం 40 ఉన్నాయని కొందరు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో నుంచి చూడటం సోము వీర్రాజు వర్గానికి రివాజుగా మారిందని, రాష్ట్రంలో పార్టీ ఎలా బలోపేతం చేయాలి? ఏయే కార్యక్రమాలు నిర్వహించాలి? జాతీయ పార్టీ నాయకుల్ని తీసుకువచ్చి పార్టీపట్ల ప్రజల్లో ఆసక్తి కలిగేలా ఎలా చేయాలి? అనే విషయాలపట్ల ఆసక్తి ఉండాలని, సొంత పార్టీలోని వ్యక్తులపైనే కేసులు పెట్టుకొని ఉపయోగమేముంటుందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications