పొత్తు: టీలో చంద్రబాబుతో బిజెపి మైండ్గేమ్
హైదరాబాద్: రాష్ట్రంలో పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి మైంగ్గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. సీట్ల పంపకంలో ఏ విధమైన పట్టు విడుపులు లేకుండా తెలుగుదేశం పార్టీ దిగిరావాలనే పద్ధతిలో బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో బిజెపి 64 శాసనసభ, 11 పార్టమెంట్ స్ధానాలలో పోటీ చేసేందుకు సిద్ధ పడింది.
ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్ధుల జాబితాను కూడా సిద్ధం చేసుకుంది. ఆ సీట్లు తమకు కావాల్సిందేనని బిజెపి పట్టుబడుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ అందుకు సిద్ధంగా లేదు. దీంతో ఒంటరి పోరుకు కూడా బిజెపి సిద్దపడుతోంది. నిజానికి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఒంటరిపోరుకే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి నేతను అంగీకరించాలని కూడా బిజెపి పట్టుపడుతోంది.

బిజెపి అడుతుగున్న సీట్లకు, తెలుగుదేశం ప్రతిపాదిస్తున్న స్ధానాలకు మధ్య తేడా చాలా ఉంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మైనర్ భాగస్వామిగా బిజెపి గుర్తిస్తుంటే, తామే మేజర్ భాగస్వాములమని టిడిపి ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 60 అసెంబ్లీ సీట్లు అడుగుతున్న బిజెపి 50 సీట్లకు అంగీకరించవచ్చునని అంటున్నారు. అయితే, 25 సీట్ల కన్నా ఎక్కువ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అలాగే 9 లోక సీట్లకు దిగిరావడానికి కూడా బిజెపి సిద్ధపడింది. అయితే ఐదు సీట్లు మాత్రమే ఇస్తామని చంద్రబాబు అంటున్నారు.
సీట్ల సంఖ్య విషయంలో ఇక్కడ చర్చలు ఒక కొలిక్కి రాకపోయినా చంద్రబాబు ఢిల్లీ నేతల ద్వారా తమపై ఒత్తిడి తెచ్చి తాననుకున్న సీట్ల సంఖ్యకే తమను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బిజెపి నేతలు పసిగట్టారు. ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ అటు బిజెపి, ఇటు తెలుగుదేశం నేతల్లో పొత్తుల విషయంలో అసహనం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications