Vande Bharat: విశాఖ నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లు ?
ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు నగరానికి క్యూ కడుతున్నాయి. ఇందులో గూగుల్ డేటా సెంటర్ తో పాటు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. వీటితో పాటు విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టు అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి ప్రస్తుతం నడుపుతున్న వందే భారత్ (vande bharat) లతో పాటు కొత్త వాటి డిమాండ్ పెరుగుతోంది.
విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని వందే భారత్ లు నడపాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో నగరానికి చెందిన ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ మేరకు విశాఖ నుంచి మరిన్ని వందేభారత్ లు ప్రకటించాలని కోరుతూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న ఎయిర్ పోర్టు కాస్తా ఈ ఏడాది జూన్-జూలై నాటికి భోగాపురానికి మారిపోతుందని, భవిష్యత్ అవసరాల దృష్టా మరిన్ని వందే భారత్ లు అవసరమవుతాయని ఆయన తెలిపారు.

ఇందులో విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నైకు మరిన్ని వందే భారత్ లు నడపాలని రైల్వే మంత్రికి రాసిన లేఖలో విష్ణుకుమార్ రాజు కోరారు. ముఖ్యంగా విశాఖపట్నం-విజయవాడ మధ్య మరిన్ని రైళ్లు నడపాల్సిన అవసరం ఉందని విష్ణు గుర్తుచేశారు. దీనిపై రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించి మరిన్ని వందే భారత్ రైళ్లు ప్రకటిస్తే ఈ ప్రాంతంలో ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. ఇప్పటికే వందే భారత్ ల ప్రకటనల విషయంలో ముందున్న రైల్వే మంత్రి విశాఖకు కొత్త వందేభారత్ లు ప్రకటించడం లాంఛనమే అనే వాదన కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications