జేసీ పొలిటికల్ బ్రోకర్ అంటున్న బిజేపి ఎమ్మెల్సీ
తూర్పుగోదావరి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎంపి జెసి దివాకర్ రెడ్డి నుద్దేశించి పరుషమైన వ్యాఖ్యలతో పాటు తీవ్ర ఆరోపణలు చేశారు. జెసి దివాకర్ రెడ్డి ఒక రాజకీయ బ్రోకర్ అని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జేసీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్న కాంగ్రెస్ కోవర్టు అని, తన సొంత పనుల కోసం చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేసిన ఘనత జెసీ దేనని విమర్శించారు.
అసలు జేసీకి బీజేపీని విమర్శించే స్థాయి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ కేవలం రూ.1400 కోట్ల టెండర్ల ప్రక్రియలో సాంకేతిక లోపాలు వస్తేనే ప్రాజెక్టును వదిలేస్తానంటూ చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు.
చంద్రబాబు పోలవరాన్ని రాజకీయం చేస్తున్నారని, అలా చెయ్యడం సరికాదనేది తన అభిప్రాయమని సోము వీర్రాజు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.