తప్పమంటూ వెంకయ్య వార్న్, టి నేతలకు డిగ్గీ కండిషన్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ ఇచ్చిన మాట తప్పదని కానీ సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు. అదే సమయంలో పొత్తులపై పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. కొంపల్లిలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెంకయ్య నాయుడు మాట్లాడారు. తెలంగాణకు బిజెపి మద్దతు ఇస్తుందన్నారు. ఇరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మహత్యలకు కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు.
తెలంగాణలో వెయ్యిమంది చావుకు కారణమైన సోనియా గాంధీకి గుడి కట్టడం విడ్డూరమన్నారు. ఒకే పార్టీ నేతలు బజారున పడి తిట్టుకుని ప్రజల్లో విద్వేషాలు రేకిత్తిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి పది జిల్లాల తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. విభజన కాంగ్రెస్ చేస్తే సరే లేకపోతే తాము అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. మొదట సీమాంధ్రలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. సిడబ్ల్యుసి తీర్మానం అంటే పార్టీ తీర్మానమని, దానిని మంత్రులు, ముఖ్యమంత్రులు విమర్శించకూడదన్నారు.
కాంగ్రెస్ బిజెపికి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోందన్నారు. దేశంలోని సమస్యలకు బిజెపి, మోడీ పరిష్కారం చూపగలరన్నారు. ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్పై ఇంత వ్యతిరేకత చూడలేదన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రధాని ప్రతిపాదిస్తే.. ఆ పార్టీ ముఖ్యమంత్రి వ్యతిరేకించడమేమిటని విమర్శించారు. అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆ పార్టీ అధిష్టానమే చెప్పిందట అన్నారు. విభజన విషయంలో రాజకీయ నాయకత్వం పరిపక్వత చూపించాలని కోరారు.
మరోవైపు పొత్తులపై రాష్ట్ర నేతలు ఎవరు హెచ్చరించారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని ఇక్కడి నేతలు మాట్లాడవద్దన్నారు. భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీతో కలవని పార్టీ వైపే బిజెపి చూస్తుందన్నారు.త
ఢిల్లీలో డికె అరుణ, షబ్బీర్ అలీ
న్యాయసలహా తీసుకోనే తెలంగాణ బిల్లును పంపించారని, కోర్టుకు వెళ్లినంత మాత్రాన ఆగుతుందనుకోవడం భ్రమేనని ఢిల్లీలో షబ్బీర్ అలీ అన్నారు. బిజెపి పార్లమెంటులో తెలంగాణకు మద్దతు ఇస్తుందని మంత్రి డికె అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మద్దతివ్వాలని అన్ని పార్టీల అధ్యక్షులను కలిసేందుకు వచ్చామన్నారు. బిజెపి మద్దతిస్తుందని డికె అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతలు తమ పబ్బం గడుపుకునేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.
రాజ్నాథ్ను మాత్రమే...
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని బిజెపి నేతలను కలుస్తామని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు దిగ్విజయ్ సింగ్ను కోరారు. అయితే, ఆయన కేవలం జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ను మాత్రమే కలవాలని, ఇతర నేతలను కలవవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది.