అయిదుమంది మృతి: గోదావరిలో లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు ఇవే..
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో ఆదివారం చోటు చేసుకున్న లాంచీ ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికులు హైదరాబాదీయులేనని తెలుస్తోంది. వారాంతపు రోజు కావడం వల్ల అత్యంత ప్రసిద్ధి చెందిన పాపికొండల మధ్య గోదావరి అందాలను తిలకించడానికి ఒక్క హైదరాబాద్ నుంచే 22 మందికి పైగా తరలి వెళ్లినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. గల్లంతైన వారిలో మరికొందరు విజయవాడ, తూర్పు గోదావరి జిల్లా రాజోలు, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు చెందిన పర్యాటకులని అంటున్నారు. వరంగల్ నుంచి రెండు కుటుంబాలు పాపికొండలను తిలకించడానికి వెళ్లి, రాయల్ వశిష్ఠ లాంచీ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
నాడు కృష్ణా..నేడు గోదావరి: పోటెత్తిన నదిలో బోటింగ్ కు అనుమతి ఎవరిచ్చారు?: ప్రభుత్వం మారినా..!
గల్లంతైన వారి పేర్లు ఇవే..
రాయల్ వశిష్ఠ లాంచీ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన సాయికుమార్, జగన్నాథ్, అబ్దుల్ సలీమ్, రాజేశ్, మహేశ్వర్ రెడ్డి, విశాల్, లక్ష్మణ్, మధు, జానకీరావు, రఘురామ్, విశాఖపట్నానికి చెందిన రమణ, విజయవాడ నుంచి గాంధీ, వరంగల్ నుంచి ఎస్ దశరథన్ వారి కుటుంబ సభ్యులు పాపికొండలకు బయలుదేరి వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వారిలో పలువురు గల్లంతు కాగా.. మరికొందరు లైఫ్ జాకెట్ల సహాయంతో ఒడ్డుకు చేరినట్లు చెబుతున్నారు. కాగా.. లైఫ్ జాకెట్లను ధరించి నదిలో కొట్టుకునిపోతున్న మరికొందరు పర్యాటకులను తూటుగుంట గ్రామస్తులు కాపాడారు.
అన్ని రిజర్వాయర్లలో బోటింగ్ రద్దు
లాంచీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోన్న ప్రస్తుత సమయంలో బోటింగ్ కు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన పర్యాటక శాఖ అధికారులను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నదులు, రిజర్వాయర్లలో బోటింగ్ ను తక్షణమే రద్దు చేయాలని వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు బోటింగ్ పై నిషేధం విధించారు. బోటింగ్ నిర్వహణ కోసం నిపుణులతో కమిటీని వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. బోట్లు, లాంచీలు, పడవల నాణ్యత, వాటి పనితీరుపై సమగ్ర నివేదిక అందజేయాలని, వాటి ఫిట్ నెస్ పై సరికొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లైసెన్స్లు పరిశీలించాలని, బోట్లను నడిపేవారు, అందులో పనిచేస్తున్నవారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా అనే విషయాన్ని తనిఖీ చేయాలని అన్నారు.
డ్రైవర్, సహాయ డ్రైవర్ మృతి
గోదావరి నదిలో దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ లాంచీ డ్రైవర్ నూకరాజు, సహాయ డ్రైవర్ జలసమాధి అయ్యారు. వారితో పాటు మరో మూడు మృతదేహాలను జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనితో ఈ ప్రమాదంలో అయిదుమంది మరణించినట్లు ధృవీకరణ అయింది. కాగా, మిగిలిన పర్యాటకుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉండటం వల్ల వారందరూ సంఘటన ప్రదేశం నుంచి కొట్టుకునిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లైఫ్ జాకెట్లు ధరించిన పర్యాటకులకు ప్రాణాపాయం ఉండకపోవచ్చని ఏదో ఒక ప్రదేశంలో వారు ఒడ్డుకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
గాలింపు కోసం హెలికాప్టర్లు..
కాగా- మృతుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గల్లంతైన వారిని అన్వేషించడానికి హెలికాప్టర్లను వినియోగించబోతున్నారు అధికారులు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ప్రభుత్వం సంఘటనా స్థలానికి తరలిస్తోంది. ఇప్పటికే ఒక ప్లటూన్ సిబ్బంది కచ్చులూరు, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. మరో రెండు గంటల్లో మరో ప్లటూన్ సిబ్బంది వారితో జత కానుంది.