అగ్రిగోల్డ్ తరహా మోసం: ‘బొమ్మరిల్లు’ రాయల రాజా అరెస్ట్
హైదరాబాద్/కృష్ణా: అగ్రిగోల్డ్ తరహాలో ఏపీలో మరో మోసం వెలుగుచూసింది. బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ అధినేత రాయల రాజాను శనివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ తరహాలో బొమ్మరిల్లు సంస్థ కూడా కృష్ణా జిల్లాలో కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడింది.
ఒక్క మచిలీపట్నం పరిధిలోనే 1.5కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం గమనార్హం. డబ్బులు తీసుకుని స్థలాలు రిజిస్ట్రేషన్ చేయకుండా తమని మోసం చేశారంటూ కొందరు బాధితులు 2104లో మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. తదుపరి విచారణను ప్రభుత్వం సీఐడికి అప్పగించింది.
ఈ క్రమంలో విచారణ జరిపిన సీఐడీ పోలీసులు రాయల రాజాను హైదరాబాద్లో అరెస్టు చేసి మచిలీపట్నం తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లగా.. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో తహశీల్దార్ ఎదుట హాజరుపర్చారు. దీంతో రాజాకు రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ తహసీల్దార్ ఆదేశాలు జారీచేశారు. అనంతరం పోలీసులు రాయల రాజాను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు.