జైట్లీ ఏం చెప్పారు, మరిగిన రక్తం చల్లారిందా: చంద్రబాబుపై బొత్స
అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో బహిర్గతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ బుధవారం నాడు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని బాబుపై మండిపడ్డారు.
ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమన్నారు. హోదా కోసం తమ ఎంపీలు లోకసభలో పోరాడుతున్నారన్నారు. వైసీపీ ఎంపీలు పోడియంలో ఆందోళన చేస్తుంటే టిడిపి ఎంపీలు మాత్రం వారి వారి స్థానాల్లో కూర్చుంటున్నారని విమర్శించారు.
చంద్రబాబుతో అరుణ్ జైట్లీ ఏం మాట్లాడారు, ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తామని చెప్పారు.. ఇవన్నీ బయట పెట్టారన్నారు. గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు.
అంతలోనే 'హోదా' సీన్ మారింది: మోడీ-జగన్లపై బాబు వ్యూహమేమిటి?
ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు రక్తం మరిగిందని చెప్పారని, మరి ఇప్పుడు ఆ మరిగిన రక్తం ఆవిరైందా అని ప్రశ్నించారు. జైట్లీతో ఫోన్లో మాట్లాడాక ఆ రక్తం మరిగడం ఆగిందా అన్నారు. చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదని, ఆయనను తాము వ్యక్తిగతంగా ఏం టార్గెట్ చేయడం లేదన్నారు.
హోదాపై కేంద్రాన్ని నిలదీయడానికి ఆయన ఎందుకు జంకుతున్నారన్నారు. ఓటుకు నోటు, స్విస్ ఛాలెంజ్ ముసుగులో చంద్రబాబు చేస్తున్న అవినీతి అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
జైట్లీ ఏదో చెప్పారుగా: వైసిపిపై సుమిత్ర ఫైర్, ఢిల్లీకి బాబు.. వ్యూహం సిద్ధం
జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారు: మేకపాటి
ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని ఒక్క అబద్ధం చెప్పి ఉంటే వైసిపి అధ్యక్షులు జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేరుగా అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం పంచాయతీలోని పండ్రంగి, నారాయణప్పపేట, సీతారామపురం అరుంధతీవాడలో వైసిపి ఆధ్వర్యంలో 'గడప గడపకు వైసిపి' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు. ఎన్నికల్లో అములుకాని హామీలిచ్చి సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. 100 ప్రశ్నలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి మార్కులు వేయాలని కోరారు.