పోల‘వరం’ కోసం హోదా తాకట్టు: చంద్రబాబుపై బొత్స సంచలనం
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఓ జాతీయ కుంభకోణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బాబు అవినీతి అవాసరాల కోసం..
చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
చంద్రబాబు ధనదాహం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని బొత్స ఆరోపించారు. చంద్రబాబు తన ఆర్థిక అవసరాల కోసం, అవినీతి కార్యక్రమాల కోసం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేయడం ద్వారా ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారని ధ్వజమెత్తారు.
పోలవరం కోసం హోదాను తాకట్టు పెట్టారు..
పోలవరం రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పోలవరం దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
సిగ్గుచేటు..
ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్పినా వినకుండా.. కంపెనీ ప్రతినిధులను బాబు వెనకేసుకొచ్చారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఆ కంపెనీ వల్లే పోలవరం ఆలస్యమైందని బాబు సాకులు చెప్పడం సిగ్గుచేటని బొత్స మండిపడ్డారు.
నోట్ల సంచుల కోసమే..
ఎన్నికల సమయంలో మీకు నోట్ల సంచులు మోసిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చింది వాస్తవం కాదా? అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ హయాంలో రూ.16వేల కోట్ల అంచనాతో పోలవరానికి శంకుస్థాపన చేసి రూ.4వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. 80శాతం వరకు కాలువలు కూడా పూర్తయ్యాయని బొత్స చెప్పారు.
రూ.300కోట్లు ఎలా పెరిగాయి?
చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం అంచనాలను రూ.16వేల కోట్ల నుంచి 48వేల కోట్లకు పెంచారని బొత్స మండిపడ్డారు. పోలవరం అంచనాలు రూ.300కోట్లు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజధనాన్ని వ్యయంగా చూపి దోచుకుంటున్నారని ఆరోపించారు. మూడున్నరేళ్లలో పోలవరంకు చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.