దీక్షను భగ్నం చేయొచ్చు, ఉద్యమాన్ని మాత్రం ఆపలేరు: బొత్స
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నల్లపాడులో చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ప్రభుత్వం బలవంతంగా భగ్నం చేసి ఉండవచ్చు, కానీ ఉద్యమాన్ని మాత్రం ఆపలేరని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మంగళవారం మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రజల కోసం చేపట్టిన దీక్షను భగ్నం చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం ఉదయం 10:30 నిమిషాలకు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దీనిని ఇంతటితో ఆపేసే ప్రసక్తే లేదని, ప్రజల్లోకి ఉద్యమరూపంలో తీసుకెళ్తామని ఆయన చెప్పారు. వైయస్ జగన్కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఆరు రోజుల పాటు వైయస్ జగన్ చేస్తున్న నిరవధిక దీక్షను మంగళవారం తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఉదయం 4 గంటలకు దీక్షాస్థిలికి చేరుకున్నారు. కాసేపు జగన్తో మాట్లాడిన తర్వాత ఉదయం 4.11 గంటలకు దీక్షను భగ్నం చేశారు.

బలవంతంగా జగన్ను దీక్షాస్థలి నుంచి ఎత్తుకెళ్లి ఆస్పత్రికి చేర్చారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నానని ఆయన పోలీసులకు చెప్పారు.
పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడ ఉఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి జగన్ను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. జగన్కు బలవంతంగా వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు.
జగన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి సూపరింటిండెంట్ చెప్పారు. కీటోన్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఫ్లూయిడ్స్, ద్రవాహారం తీసుకుంటే జగన్ ఆరోగ్య పరిస్థితి మెరగవుతుందని అన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వైయస్ జగన్ను తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి వైయస్ షర్మిల పరామర్శించారు.












Click it and Unblock the Notifications