ఉల్లంఘన జరగొద్దనే: సీమాంధ్ర దీక్షపై కిరణ్కి బొత్స షాక్
న్యూఢిల్లీ: తాము సమైక్యవాదులమేనని అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని మొదటి నుండి చెప్పుకొస్తున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కాంగ్రెసు నేతల దీక్షపై ఝలక్ ఇచ్చారు. బుధవారం కిరణ్, బొత్సల నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మౌన దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే.
దీనిపై బొత్స ఢిల్లీలో స్పందించారు. విభజనలో రాజ్యాంగ ఉల్లంఘన ఉండవద్దనే తాము దీక్ష చేస్తున్నామని చెప్పారు. రేపు ఉదయం రాజ్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించి ఆ తర్వాత దీక్ష చేస్తామన్నారు. సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి విభజన రాజ్యాంగబద్దంగా లేదని చెబుతామన్నారు. విభజన రాజ్యాంగ వ్యతిరేకమని తమ అభిప్రాయమన్నారు. తాము రాజ్యాంగపరంగా విభేదిస్తున్నామన్నారు.

ఆ తర్వాత తాము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అసెంబ్లీ, మండలి నిర్ణయాలకు అనుగుణంగా పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తారన్నారు. సీమాంధ్ర ప్రజలను ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మోసం చేస్తోందన్నారు. విభజన కోరుకుంటున్న బిజెపితో తెలుగుదేశం పార్టీ జత కడుతోందన్నారు. వార్ రూమ్ సమావేశంలో పాల్గొనేందుకు తనకు, కిరణ్కు ఆహ్వానం అందలేదన్నారు. వార్ రూంలో ఇరు ప్రాంతాల ఎంపీలు అభిప్రాయాలు చెబుతారన్నారు.
మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాన్ని చీల్చవద్దనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయస్పందన అని కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. తాము సమైక్యం కోసం చివరి వరకు పోరాడుతామన్నారు. సమైక్య పోరులో తాము సఫలమౌతామని చెప్పారు. గతంలోను సమైక్యవాదం గట్టిగా వినిపించామన్నారు.
మరోసారి సమ్మెబాట: అశోక్ బాబు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎపిఎన్జీవోలు మరోసారి సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రభుత్వ సిఎస్ కార్యాలయంలో సమ్మె నోటీసు ఇచ్చారు. రేపు సిఎస్ను వ్యక్తిగతంగా కలసి మరోసారి నోటీసు ఇస్తామని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు తెలిపారు. సమైక్య పరిరక్షణ వేదిక తరఫున నోటీసిచ్చామన్నారు.
సమ్మె సందర్భంగా జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకో లాంటి కార్యక్రమాలు కూడా అవసరమైతే చేపడతామన్నారు. ఎన్నికల విధులను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications