నిన్న స్కూల్లో చేరి... నేడు అసువులు బాసి...
హైదరాబాద్: నిన్న (మంగళవారం) ప్లే స్కూల్లో చేరి, నేడు (బుధవారం) సంపులో పడి ఓ రెండున్నరేళ్ల బాలుడు మరణించిన హృదయవిదారక సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. రెండున్నరేళ్ల బాలుడిని తల్లిదండ్రులు వనస్థలిపురంలోని అభిజ్ఞాన్ కిడ్స్ కేర్ స్కూల్లో చేర్చారు. వచన్ అనే ఆ రెండున్నరేళ్ల బాలుడు బుధవారం పాఠశాల సంపులో పడి మరణించాడు.
బాలుడు సంపులో పడిన విషయాన్ని అక్కడి ఆయా గానీ ఇతరులు గానీ గుర్తించలేదు. వారు గుర్తించేసరికి అతను మరణించాడు. సంపులో పడిన బాలుడిని తీసి ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు గుర్తించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పాఠశాల యజమానులు పాఠశాలకు తాళాలు వేసి చల్లగా జారుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కారులో మంటలు... వ్యక్తి సజీవదహనం...
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దానావాయిపేటలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. నారాయణపురానికి చెందిన దాసరి సోమరాజు తన మారుతీ కారులో ఇంటర్నెట్ సెంటర్కు వెళ్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న ముగురు కాలువలోకి దూసుకెళ్లింది.
కారులో ఉన్న ఎల్పీజి కిట్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న సోమరాజు పూర్తిగా కాలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.












Click it and Unblock the Notifications