ఎంత మార్పు : అప్పట్లో టీడీపీని చీల్చి చెండాడి, ఇప్పుడేమో!
విజయవాడ : ఆమధ్య.. ఏపీ సర్కార్ చేపట్టిన భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. టీడీపీ నాయకులపై దుమ్మెత్తిపోసిన బోయపాటి సుధారాణి, ఇప్పుడదే టీడీపీ ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
టీడీపీ ప్రభుత్వంపై అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ యూట్యూబ్ వీడియోల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీకే ఓటు వేస్తూ వస్తున్నందుకు తగిన శాస్తే జరిగిందన్న తరహాలో కామెంట్స్ చేసిన ఆమె.. 'కడుపుకు అన్నం తినేవాడెవడు మూడు పంటలు పండే భూములను వదులుకోడని' తీవ్ర స్థాయిలో టీడీపీపై విరుచుకుపడింది. అంతేనా..! 'వాడి పొలం ఇవ్వమనండి.. రాజధానికి ఇస్తాడేమో, పత్తిపాటి గాడు ఇస్తాడా..? నారాయణ గాడు ఇస్తాడా అంటూ..? టీడీపీ దుమ్ము దులిపింది సుధారాణి.
అయితే ఇప్పుడా సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పట్లో అంతెత్తున ఉరిమిపడ్డ బోయపాటి సుధారాణి ఆగ్రహావేశాలన్ని చప్పున చల్లారినట్లున్నాయి. ఇందుకు నిదర్శనం.. ఏ చంద్రబాబును, టీడీపీని సుధారాణి విమర్శించిందో.. అదే చంద్రబాబు చేతుల మీదుగా 'కైజాల యాప్ బెస్ట్ సెల్ఫీ' అవార్డును అందుకుంది. పుష్కరాల సందర్బంగా.. ఈ నెల 21వ తేదీన ఫెర్రీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఈ అవార్డును సీఎం చంద్రబాబు సుధారాణికి అందజేశారు.
కాగా, సుధారాణి ధోరణిపై పలువురు నెటిజెన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో ప్రభుత్వంపై ఆగ్రహాంతో ఊగిపోయిన సుధారాణియేనా..! ఈ సుధారాణి, అన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మేనేజ్ మెంట్ మహిమో లేక సుధారాణిలోనే వచ్చిన మార్పో తెలియదు గానీ మొత్తానికి టీడీపీకి వ్యతిరేకంగా బలమైన గొంతు వినిపించిన సుధారాణి ఇప్పుడదే ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం.. ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారింది.