శ్రీవారి భక్తులకు టీటీడీ కొత్త ఛైర్మన్ సూచన
TTD Chairman BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్గా బీ రాజగోపాల నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొందరు పాలక మండలి సభ్యులూ ప్రమాణం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం తిరుమల అన్నమయ్య భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు బీఆర్ నాయుడు. తన ప్రాధాన్యతల గురించి వివరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తానని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని చెప్పారు.

శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలను తెలియజేశారు. తాను చిన్నప్పటి నుంచే ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడినని గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని శ్రీవారు ప్రసాదించారని, ఇది తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. భక్తులకు సేవ చేసే విషయంలో మీడియాతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు కిందటి నెలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించారని అధికారులకు అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడటం, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడంలో అధికారులు సమష్టి కృషిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు టీటీడీ సీనియర్ అధికారులందరితో బీఆర్ నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై ఈఓ జే శ్యామలరావు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. తిరుమల ఆలయం, స్థానిక దేవాలయాలు, అన్నప్రసాదం, విజిలెన్స్, ఆరోగ్యం, రవాణా, ఐటి, గోశాల, ఉద్యానవనం, అటవీ శాఖ, విద్యాసంస్థలు ప్రాముఖ్యతను వివరించారు.
ఆసుపత్రులు, మెడికల్, పిఆర్ వింగ్, రిసెప్షన్, కళ్యాణకట్ట, హిందూ ధార్మిక ప్రాజెక్టులు, యాత్రికుల దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలను చూసుకోవడంతో పాటు తమ నిబద్ధతతో సంస్థ ఖ్యాతిని అన్ని స్థాయిలలో ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగులు అంకితభావంతో ఉన్నారని ఈవో తెలిపారు.












Click it and Unblock the Notifications