విశాఖలో బ్రదర్ అనిల్ కలక భేటీ : వైసీపీకి మద్దతు ఇచ్చారు -నేడు ఇబ్బందులు : సీఎం పైనా..!!
కొద్ది రోజులుగా ఏపీలో బ్రదర్ అనిల్ కుమార్ వరుస పర్యటనలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. ఆయన వరుసగా పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఆకస్మికంగా రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లితో సమావేశమై సుదీర్ఘ చర్చలు చేసారు. అందులో రాజకీయంతో పాటుగా కుటుంబ వ్యవహారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో పలు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో అనిల్ కొత్తగా పార్టీ ఏర్పాటు దిశగా మంతనాలు చేస్తున్నారనే ప్రచారం సాగింది. పలు సంఘాల నేతలు సైతం ఆయన్ను పార్టీ ఏర్పాటు చేయమని కోరామంటూ నేతలు చెప్పుకొచ్చారు.
నాడు వైసీపీకి మద్దతుగా నిలిచినా..
అయితే, దీనిని అనిల్ ఖండించారు. పార్టీ ఏర్పాటు వార్తల్లో నిజం లేదన్నారు. ఇక, ఈ రోజు ఆయన విశాఖలో మరోసారి ఎస్సీ..ఎస్టీ..బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం పైన ఆయన స్పందించారు. తాను సమావేశమైన సంఘాలు ఎన్నికల ముందు వైసీపీకి సహాయం చేసారని..అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. వైసీపీ విజయానికి కారకులైన వారికి న్యాయం జరగటం లేదన్నారు. పైరవీలు చేసే వారికే పార్టీలో గర్తింపు దక్కుతుందని వ్యాఖ్యానించారు.వాళ్ల బాధలు వినేందుకే తాను ఉత్తరాంధ్రకు వచ్చానని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ అన్ని సంఘాల నుంచి ఉందని చెబుతూ.. పార్టీ ఏర్పాటు సాధారణమైన విషయం కాదన్నారు.
సీఎంను నేరుగా కలవక్కర్లేదు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎంను కోరతానని చెప్పారు. సీఎం చాలా బిజీగా ఉంటారని..తన పనిలో తాను బిజీగా ఉంటానని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిని కలిసి రెండున్నారేళ్లు అయిందని చెప్పుకొచ్చారు. ఈ సంఘాల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇస్తామని.. సీఎంను నేరుగా కలవాల్సిన అవసరం లేదని బ్రదర్ అనిల్ కుమార్ స్పష్టం చేసారు. దీని ద్వారా తాను సీఎంను కలవటం లేదనే అంశాన్ని స్పష్టం చేసారు. కానీ, గతంలో పార్టీ ఏర్పాటు ఆలోచన లేదని స్పష్టం చేసిన అనిల్..ఈ రోజు పార్టీ ఏర్పాటు కోసం డిమాండ్ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.
బ్రదర్ అనిల్ వ్యూహం ఏంటి
అయితే, బ్రదర్ అనిల్..రెండున్నారేళ్లుగా జగన్ తో దూరంగా ఉంటున్న విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసారు. అయితే, సీఎంను నేరుగా కలవకుండానే వినతి పత్రం ద్వారా వారి సమస్యలను ప్రస్తావిస్తానని చెప్పటం ద్వారా..అనిల్ ఏపీలోనూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే అంశం అర్దం అవుతోంది. అయితే , కొత్త పార్టీ అంశం లేకున్నా.. నాడు వైసీపీ కోసం పని చేసిన వారు ఇబ్బంది పడుతున్నారనే సంకేతాలు ఇవ్వటం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక, రానున్న రోజుల్లో బ్రదర్ అనిల్ వేసే రాజకీయ అడుగుల పైనా ఆసక్తి పెరుగుతోంది.